రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-08-26T04:57:53+05:30 IST
చేసిన అప్పులు తీర్చలేనన్న మనస్తాపంతో హన్వాడ మండలం పల్గుతండాకు చెందిన కాట్రావత్ నాన్యనాయక్(37) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పుల బాధలే కారణం
రెండెకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు
జడ్చర్ల, ఆగస్టు 25: చేసిన అప్పులు తీర్చలేనన్న మనస్తాపంతో హన్వాడ మండలం పల్గుతండాకు చెందిన కాట్రావత్ నాన్యనాయక్(37) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జడ్చర్ల సీఐ వీరస్వామి వివరాల ప్రకారం.. నాన్యనాయక్ తండాలలో కొందరి వద్ద అప్పు చేసి, ఐదేళ్ల కిందట పని కోసం సౌదీఅరేబియాకు వెళ్లాడు. అక్కడా పని దొరకక గత సంవత్సరం తిరిగి వచ్చాడు. జడ్చర్ల మండలం ఆలూరు సమీపంలో రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాడు. పంట సరిగా లేకపోవడంతో ఐదేళ్ల కిందట చేసిన అప్పులు, తాజాగా పంట కోసం చేసిన అప్పులు తీర్చలేనన్న మనస్తాపంతో కౌలుకు తీసుకున్న పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాన్యనాయక్ భార్య కాట్రావత్లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది.