కలగానే.. బీటీ రోడ్ల నిర్మాణం
ABN , First Publish Date - 2021-10-19T05:08:19+05:30 IST
ఎన్నికల హమీలు కలగానే మిగిలిపోతున్నాయి.
శంకుస్థాపన చేసి ఏళ్లు గడుస్తున్నా.. బీటీకి నోచుకోని వైనం
తీవ్ర ఇబ్బందుల్లో ప్రయాణికులు
ధన్వాడ, అక్టోబరు 18 : ఎన్నికల హమీలు కలగానే మిగిలిపోతున్నాయి. మీ రోడ్లను బాగు చేస్తాం.. డబుల్ రోడ్లు వేస్తాం.. అంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయి. దీంతో మండలంలో ఒకటి రెండు కాదు దాదాపుగా మూడునాల్గు రోడ్లు బీటీకి నోచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గత ఎన్నికల కన్న ముందు పలు రహదారులను బీటీ రోట్లుగా మార్చేందుకు నాయకులు ఆఘమేఘాలతో శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి మూడేళ్లవుతున్నా నిర్మాణం మాత్రం చేపట్టడం లేదు. మొన్నటికి మొన్న ధన్వాడ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో కిష్టాపూర్ సర్పంచ్ చిట్టెం దామోదర్రెడ్డి, గోటూర్ సర్పంచ్ నారాయణరెడ్డితో పాటు పలువురు ఎంపీటీసలు బీటీ రోడ్ల నిర్మాణాల జాప్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. గోటూర్ నుంచి కిష్టాపూర్ రహదారి నిర్మాణం చేపట్టే కాంట్రాక్టరును తొలగించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కంసాన్పల్లి నుంచి ఎంన్మోన్పల్లి వరకు బీటీ రోడ్డు, కిష్టాపూర్ నుంచి దొడ్లతండా, మడిగేల ముల్లయ్యతండా నుంచి వందరగుట్ట తండా బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగి ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కావడం లేదు. ఆకుమర్రి తండా రోడ్డు పరిస్థితి మరి అధ్వానంగా తయారైంది. కంకర వేసి దాదాపు నాలుగేండ్లు గడుస్తున్నా పనులు పూర్తి కావడం లేదు. కంసాన్పల్లి నుంచి ఎంన్మోన్పల్లి వరకు బీటీ రోడ్డు పనులు ప్రారంభం కాకపోవడంతో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు కలిసి శ్రమదానంతో మొరంతో రోడ్డును బాగు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.
బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన
గున్ముక్ల నుంచి గుడిగుండ్ల, మంత్రోన్పల్లి నుంచి గుడిగుండ్ల రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని ఆదివారం బీజేపీ, బీజేవైఎం నాయకులు ఆందోళన నిర్వ హించారు. ఈ సందర్భంగా రోడ్డు కోసం పాదయాత్ర నిర్వహించి జాతీయ రహదారిపై బైఠాయించారు.