వేంకటేశ్వర స్వామికి దాసంగాల సమర్పణ
ABN , First Publish Date - 2021-12-26T06:02:43+05:30 IST
మల్దకల్ మండల కేంద్రంలో స్వయంభువు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగిసినా భక్తుల రద్దీ తగ్గలేదు.

- పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు
- గోవింద నామస్మరణతో మారుమోగిన మల్దకల్
మల్దకల్, డిసెంబరు 25 : మల్దకల్ మండల కేంద్రంలో స్వయంభువు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగిసినా భక్తుల రద్దీ తగ్గలేదు. స్వామివారి దర్శనానికి శనివారం భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాలలో దాసంగం సమర్పించలేకపోయిన వారు మొదటి శనివారం దాసంగాలు నివేదించడం ఇక్కడ ఆనవాయితీ. దీంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. ఈ సందర్భంగా భక్తుల గోవిందనామస్మరణతో ఆలయం మారుమోగింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శనివారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ అధికారులు ఆమెను స్వామివారి శేషవస్త్రం అందించి సన్మానించారు.