కేసీఆర్.. యాది మరిచితిరా?
ABN , First Publish Date - 2021-06-18T05:11:45+05:30 IST
జోగుళాంబదేవి ఆలయం నుంచి పాదయాత్ర చేపట్టిన సమయంలో ఇచ్చిన హామీని యాదీ మరచితిరా అంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు.
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి
అయిజ, జూన్ 17 : జోగుళాంబదేవి ఆలయం నుంచి పాదయాత్ర చేపట్టిన సమయంలో ఇచ్చిన హామీని యాదీ మరచితిరా అంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ఆర్డీఎస్ దగ్గర కుర్చీ వేసుకొని కూర్చుని అభివృద్ధి చేస్తానన్నారు, ఆ కుర్చీ ఏమయ్యిందంటూ ఎద్దేవా చేశారు. అయిజ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. అభివృద్ధి సంగతి అటుంచితే నేడు ఆంధ్ర పాలకులు ఏకంగా కాలువ తవ్వుతుంటే ఆపకుండా చో ద్యం చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా హడావిడిగా ప్రారంభించిన తుమ్మిళ్ళ రిజర్వాయర్ నేటికీ పూర్తి కాలేదని గుర్తు చేశారు. నడిగడ్డను నాశనం చేశారని ఆరోపించారు. ఆంధ్ర పాలకులు చేపట్టిన కాలువ నిర్మాణాన్ని ఆపక పోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్య క్రమంలో బీజేపీ నాయకులు తిర్మల్రెడ్డి, శేఖర్, నర్సింహయ్యశెట్టి, గోపాలకృష్ణ, నర్సన్గౌడు, రాజేష్గౌడు, యుగంధర్ గౌడ్, జానకీరామ్, లక్ష్మణ్గౌడు తదితరులు పాల్గొన్నారు.
వంద పడకలపై హామీ ఎమైంది?
అలంపూరు : అలంపూర్లో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని 2016లో ముఖ్య మంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమయ్యిందని బీజేపీ సీనియర్ నాయకుడు జగదీష్ ప్రశ్నించారు. అలం పూరులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహాం, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అలంపూరులోనే వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చి మరచి పోయారని ఆరోపించారు. ఇప్పటికైనా 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీజీపీ నాయకుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.