భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-09-04T05:29:44+05:30 IST

భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం

భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం
అన్నారుపాడు - గుండ్ల రేవు గ్రామాల మధ్య పెద్దవాగు పొంగిన దృశ్యం

జలమయమైన లోతట్టు ప్రాంతాలు

సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం 

కేటీపీఎస్‌కు పోటెత్తిన వరద

కొత్తగూడెం, సెప్టెంబరు 3: భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో జనజీవనం అతలాకుతలమైంది. జిల్లాలో 12సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సుమారు గంటపాటు ఉరుములు, మెరుపులతో పడిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే కొత్త గూడెం, ఇల్లెందు, మణుగూరు సింగరేణి ఏరియాల్లోని ఓపెన్‌కాస్టు గనుల్లో నీరు చేరగంతో 50వేల టన్నల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రోడ్ల పైకి వరద రావడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. కొత్తగూడెంలోని  రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద వాన నీరు పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం జరిగింది.  లోతట్టు ప్రాంతా ల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో నివాసితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల పొలాల్లో నీరు చేరగా.. పూతదశకు వచ్చిన పత్తికి కొంతమేర నష్టం జరిగినట్టు అంచనా. చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలను తల పిస్తున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిండగా.. సింగభూపాలం ప్రాజెక్టు అలుగు పడింది. ములకలపల్లి మండలంలో మూకమామిడి, అశ్వారావుపేటలోని పెద్ద వాగు ప్రాజెక్టుల నుంచి నీటిని వదులుతు న్నారు. పినపాక మండలంలో 41.2మిల్లీ మీటర్లు, చర్ల 38.4 మి.మీ, దుమ్ముగూడెంలో 8.2 మి.మీ, అశ్వారావుపేటలో 24,8మి.మీ, మణుగూరు 64.2మి.మీ, గుండాల 17.6మి.మీ, ఇల్లెందు 52.4మి.మీ, టేకులపల్లి 94.మి.మీ, జూలూరుపాడు 19.2మి.మీ, పాల్వంచ 41.2మి.మీ, కొత్తగూడెం 128.5మి.మీ, బూర్గం పాడు 21.5మి.మీ, భద్రాచలం 17.2మి.మీ, అశ్వారావుపేట 15.5మి.మీ, దమ్మపేట 2.8మి.మీ, ములకలపల్లి 1.6మి.మీ వర్షపాతం నమోదైంది.  




కేటీపీఎస్‌ కోల్‌ప్లాంట్‌లోని పలు విభాగాల్లోకి నీరు

పాల్వంచ, సెప్టెంబరు 3: శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌)ఏడోదశలోకి వరదనీరు పోటెత్తింది. కర్మాగారం కోల్‌ప్లాంట్‌లోని పలు విభాగాల్లోకి నీరు చేరగా, సుమారు 60మీటర్ల ఎత్తులో ఉన్న కోల్‌ కన్వేయర్‌ టీపీ 4, టీపీ5, టీపీ 6 ప్రదేశాల్లో, ట్రాన్స్‌ఫార్మర్‌ యార్డు, స్ట్రక్చర ప్రదేశాల్లో, అంతర్గత రహదారులపై నీరు చేరింది. కోల్‌ యార్డులో బొగ్గు తడిచి ముద్దవడంతోపాటు.. కీలక భాగాల్లో నీరు చేరటంతో కార్మికులు బురదలోనే విధులకు హాజర య్యారు. దీంతో కేటీపీఎస్‌ అధికారులు సివిల్‌ ఆర్టీజన్లతో డ్రెయిన్లలో చేరిన చెత్తను తొలగింపజేయడంతో రోడ్లపైన నిలిచిన నీరంతా పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2021-09-04T05:29:44+05:30 IST