రేపటిలోపు వేతనాలు చెల్లించాలి
ABN , First Publish Date - 2021-03-21T06:45:37+05:30 IST
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పని చేస్తున్న అవుట్సోర్సింగ్, తాత్కాలిక సిబ్బంది వేతనాలు సోమవారంలోపు పూర్తిగా చెల్లించాలని దేవస్థానం ఈవో బి.శివాజీని భదారద్రి జిల్లా కలెక్టర్ ఎంవీ. రెడ్డి ఆదేశించారు.

భద్రాద్రి దేవస్థానం ఈవోకు కలెక్టర్ ఆదేశం
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
భద్రాచలం, మార్చి 20: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పని చేస్తున్న అవుట్సోర్సింగ్, తాత్కాలిక సిబ్బంది వేతనాలు సోమవారంలోపు పూర్తిగా చెల్లించాలని దేవస్థానం ఈవో బి.శివాజీని భదారద్రి జిల్లా కలెక్టర్ ఎంవీ. రెడ్డి ఆదేశించారు. ఈ వేతనాల సమస్యపై ‘కమిషనర్ ఆదేశాలు బేఖతారు’ ఏడు నెలలుగా వేతనాలు అందని సిబ్బంది అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో వెలువడిన కథనంపై కలెక్టర్ స్పందించారు. ఈ విషయంపై దేవస్థానం అధికారులను కొత్తగూడెంలోని తన కార్యాలయానికి పిలిపించిన కలెక్టర్ వారితో ఈ విషయంపై విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సందర్భంగా సిబ్బంది వేతనాలు సోమవారం చెల్లించాలని కలెక్టర్ ఆదేశించారు. దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బందికి నిర్దేశించిన ప్రకారం వేతనాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయా లేదా..? అనే విషయంపై స్టేట్మెంట్లను తీసుకొని బుధవారం రావాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయంపై దేవస్థానం అధికారుల తీరుపై కలెక్టర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వినికిడి.