నమ్మకద్రోహం, పగతోనే హత్య
ABN , First Publish Date - 2021-01-13T05:02:09+05:30 IST
వైరాలో సంచలనం కల్గించిన రాష్ట్ర బీజేపీ ఆర్టీఐ సెల్ కో కన్వీనర్ నేలవల్లి రామారావు హత్యకేసులో నిందితుడైన మాడపాటి రాజేష్ను ఆతర్వాత అతడికి సహకరించిన బొమ్మినేని హరీష్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి మధిర కోర్టుకు రిమాండ్ చేశారు.
బీజేపీ నాయకుడు రామారావు హత్యకేసులో నిందితుడి అరెస్టు, రిమాండ్
వైరా, జనవరి 12: వైరాలో సంచలనం కల్గించిన రాష్ట్ర బీజేపీ ఆర్టీఐ సెల్ కో కన్వీనర్ నేలవల్లి రామారావు హత్యకేసులో నిందితుడైన మాడపాటి రాజేష్ను ఆతర్వాత అతడికి సహకరించిన బొమ్మినేని హరీష్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి మధిర కోర్టుకు రిమాండ్ చేశారు. రామారావు హత్యకు ఆర్థిక లావాదేవీలు, స్నేహంలో నమ్మకద్రోహం ప్రధాన కారణాలుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. వైరా సీఐ జెట్టి వసంతకుమార్ కథనం ప్రకారం... రామారావు హత్యకు రాజేష్ పాల్పడిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. గత ఏడాది డిసెంబరు 26న ఉదయం ఇంట్లో ఉన్న రామారావును హత్యచేశాడు. మంగళవారం ఇంట్లో ఉన్న రాజేష్ను అతడికి సహకరించిన బొమ్మినేని హరీష్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేశారు. స్నేహం లో నమ్మించి డబ్బులు తీసుకొని ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తూ నమ్మకద్రోహానికి పాల్పడటం, ఏడాదికాలంగా ఫోన్ ఎత్తకుండా తప్పించుకొని తిరుగుతుండటంతో విసిగిన రాజేష్ కసితో పగ పెంచుకొని ఒక పథకం ప్రకారం రామారావును దారుణంగా హత్యచేశాడు. రామారావును హత్యచేసిన రాజేష్ను, ఆతర్వాత కారులో మధిర తీసుకువెళ్లిన హరీష్ను ఏ1, ఏ2ముద్దాయిలుగా నిర్థారించి అరెస్టు చేసి మంగళవారం రాత్రి మధిర కోర్టులో రిమాండ్ చేశారు. కత్తి, రక్తంమరకలతో ఉన్న దుస్తులు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వైరా ఏసీపీ కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో సీఐ వసంతకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.