యువత కృషే.. ప్రగతికి నాంది.. ఫ్రీడమ్ రన్లో ఇరుజిల్లాల ఉన్నతాధికారులు
ABN , First Publish Date - 2021-03-25T05:17:16+05:30 IST
దేశం ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే యువత కష్టపడాలని ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్లు పేర్కొన్నారు. స్వతంత్ర భారత అమృత్ మహోత్సవాల సందర్భంగా బుధవారం నగరంలోని లకారం ట్యాంకుబండ్ వద్ద జరిగిన ఫ్రీడమ్రన్ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఖమ్మం స్పోర్ట్స్/లక్ష్మీదేవిపల్లి, మార్చి 24: దేశం ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే యువత కష్టపడాలని ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్లు పేర్కొన్నారు. స్వతంత్ర భారత అమృత్ మహోత్సవాల సందర్భంగా బుధవారం నగరంలోని లకారం ట్యాంకుబండ్ వద్ద జరిగిన ఫ్రీడమ్రన్ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులు తమ నైపుణ్యాలతో కలిసికట్టుగా పని చేస్తూ దేశాభివృద్ధికి ముందుండాలని.. అదే స్వతంత్ర భారతావనికి నిజమైన నివాళి అని అన్నారు. అనంతరం జలశక్తి అభియాన్, పోషణ్ అభియాన్ కార్యక్రమాలపై వారు మాట్లాడుతూ వర్షపు నీటిని వడిసిపట్టి భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయాల న్నారు. పౌష్టికాహారం, నీటి ప్రాధాన్యతలను వారు వివరిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు జరిగిన ఫ్రీడమ్రన్ కార్యక్రమాన్ని వారుజెండా ఊపి ప్రారంభించారు. క్రీడాజ్యోతిని చేతబూని ఫ్రీడమ్ రన్లో పాల్గొన్నారు. ఫ్రీడమ్రన్లో ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, పటేల్ స్టేడియం క్రీడాకారులు భారీగా పాల్గొన్నారు. కార్యక్రమంలో 11ఎన్సీసీ బెటాలియన్ కమాండెంట్ సమిత్ కర్కీ, జిల్లా టూరిజం అధికారి సుమన్ చక్రవర్తి, డీవైఎస్వో పరంధామ రెడ్డి, డీఆర్డీఏ పీడీ శిరీష, సంక్షేమ అధికారిణి సంధ్యారాణి, డీఐఈవో రవిబాబు, ఎన్సీసీ సుబేదార్ మేజర్ గోవిందరావు, ఎన్ఎస్ఎస్ కో- ఆర్డినేటర్ జీవన్కుమార్, అథ్లెటిక్స్ కోచ్ గౌస్, సీపీవో శ్రీనివాస్, నగర ఏసీపీ ఆంజనేయులు పలువురు కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. అదేవిధంగా లక్ష్మిదేవిపల్లి మండలం ఇల్లెందు క్రాస్రోడ్డు నుంచి పాల్వంచ మండలం కేఎస్ఎం పెట్రోల్ బంక్ వరకు ఫ్రీడం రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంవీ రెడ్డి మూడు రంగుల బెలూన్లును గాల్లోకి ఎగురవేసి, జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారని, వారందరి పోరాట ఫలితం గానే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్చా స్వాతంత్య్రమన్నారు.