గంగారంలో ఫుట్పాత్ల ఆక్రమణ
ABN , First Publish Date - 2021-02-07T04:47:12+05:30 IST
అడ్డగోలుగా ఫుట్పాత్ ఆక్రమణలు ఆ గ్రామంలోని రింగ్సెంటర్కు నలువైపులా విస్తరించాయి. ఏళ్లుగా ఇవే ఆక్రమణలు సాగిస్తూ వ్యాపారం చేసుకుంటూనే ఉన్నారు.

అక్రమంగా శాశ్వత నిర్మాణాలు చేపడుతున్న వ్యాపారులు
పట్టించుకోని అధికారులు
సత్తుపల్లిరూరల్, ఫిబ్రవరి 6 అడ్డగోలుగా ఫుట్పాత్ ఆక్రమణలు ఆ గ్రామంలోని రింగ్సెంటర్కు నలువైపులా విస్తరించాయి. ఏళ్లుగా ఇవే ఆక్రమణలు సాగిస్తూ వ్యాపారం చేసుకుంటూనే ఉన్నారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఆ గ్రామంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదేమని ప్రశ్నించే అధికారులు లేకపోవడంతో అడిగేదెవరంటూ షాపుల నిర్వహకులు అక్రమ శాశ్వత నిర్మాణాలను చేపట్టారు.
రద్దీగా సరిహద్దు ప్రాంతం..
రాష్ట్ర సరిహద్దులోని ప్రధాన రద్దీగా గంగారం గ్రామం వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. కొన్నేళ్ల క్రితం ఆర్అండ్బీ శాఖ ఇక్కడ ఉన్న స్టేట్ హైవేపై రింగ్సెంటర్ను ఏర్పాటు చేయగా డివైడర్ను కూడా నిర్మించింది. ఇక్కడ నుంచి సత్తుపల్లి, ఖమ్మం, పాల్వంచ, భద్రాచలం, చింతలపూడి, ఏలూరు, అశ్వారావుపేట, రాజమండ్రి తదితర పట్టణాలకు ఆంధ్రాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రయాణాలు సాగుతుంటాయి. ఇప్పుడు జాతీయ రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి.
బాటసారులకు ఇబ్బందులు
రహదారికి ఆనుకుని ఉన్న వ్యాపారస్థులు జాతీయ రహదారిపై ఉన్న ఫుట్పాత్ను ఆక్రమించుకుని వ్యాపారాలు సాగిస్తున్నాయి. దుకాణాలు రహదారిపైకి చొచ్చుకు రావడం, బాటసారులకు నడిచే దారి లేక అవస్థలు పడుతున్నారు. శాశ్వత నిర్మాణాలు చేపట్టి మరీ వ్యాపారాలు సాగుతున్నాయి. దీంతో రహదారిపైకి వచ్చే వాహనాలు వేగంగా వెళ్లడంతో బాటసారులు నడిచే అవకాశం లేకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు.
నోటీసులు ఇచ్చి.. ఆక్రమణలు తొలగిస్తాం: ప్రసాద్, పంచాయతీ సెక్రటరీ, గంగారం
అక్రమ శాశ్వత నిర్మాణాలు, ఫుట్పాత్ల ఆక్రమణలు పరిశీలిస్తాం. ఆక్రమణలు తొలగించాలని ఆదేశించాం. ఆక్రమణ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు ఇస్తాం. జరిమానా విధించడంతో పాటు ఆర్అండ్బి శాఖతో కలసి ట్రాఫిక్ను క్రమబద్దీకరిస్తామన్నారు.