ఏది అక్రమం.. ఏది సక్రమం?

ABN , First Publish Date - 2021-10-30T05:04:07+05:30 IST

జిల్లా పోలీస్‌ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసే పోలీసుల మధ్య సమన్వయం లోపించిందని మరోసారి భహిర్గతమైంది.

ఏది అక్రమం.. ఏది సక్రమం?
టాస్క్‌ఫోర్స్‌ అదుపులో నిందితులు, బాణసంచా

పాల్వంచలో వ్యాపారుల ఇళ్లపై దాడులు

రూ. 18 లక్షల టపాసుల స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్‌

వెంటనే నిందితులను వదిలేసిన పోలీసులు

బాణసంచా కూడా వారికే అప్పగించిన వైనం

వివరణకు ఆంధ్రజ్యోతి యత్నం.. స్పందించని అధికారులు

పాల్వంచ రూరల్‌, అక్టోబరు 29: జిల్లా పోలీస్‌ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసే పోలీసుల మధ్య సమన్వయం లోపించిందని మరోసారి భహిర్గతమైంది. పాల్వంచ పట్టణంలో వివిధ ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శుక్రవారం టాస్క్‌ఫోర్స్‌ సీఐ పుల్లయ్య, పోలీస్‌ అధికారులు జగన్‌, విజయ్‌, వెంకటనారాయణ, సాయి, ఎలమందలు, ఎస్‌ఐ ప్రవీణ్‌తో కలిసి దాడులు నిర్వహించారు. ఈక్రమంలో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులు లభ్యమయ్యాయి. ఐదు ప్రాంతాల్లో దొరికిన టపాసులకు ఎటువంటి అనుమ తులు లేకపోవడంతో వాటిని సీజ్‌ చేసి పాల్వంచ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వాటి సుమారు 18లక్షలు ఉంటుందని, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు తెలిపారు. కాగా పోలీసులు పట్టుబడ్డ నిందితులను వదిలేశారు, స్వాధీనం చేసుకున్న టపాసులను వారికే అప్పగించారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ అధికారులతో ప్రత్యక్షంగా పాల్గొన్న పోలీసులే టపాసులను సీజ్‌ చేశారు. వారే నిందితులను, పట్టుకున్న టపాసులను వదిలేయడం గమనార్హం. వాస్తవానికి గత శుక్రవారం కలెక్టర్‌ అనుదీప్‌ దీపావళి బాణసంచా దుకాణాల ఏర్పాటుకు సంబంధించి విలేకరుల సమావేశం నిర్వహించారు. అనుమతుల కోసం 31 నుంచి సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఇప్పటి వరకూ ఎవరికీ అనుమతులు ఇవ్వనట్టే. కానీ పాల్వంచ వ్యాపారులకు అనుమతులు ఎవరు ఇచ్చారు? అసలు ఆ టపాసులు ఎక్కడి నుంచి తెచ్చారు? పట్టుకున్న పోలీసులు ఎందుకు వదిలేశారనేది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నలు. దీనిపై పోలీస్‌ అధికారులను వివరణ కోరేందుకు ఆంధ్రజ్యోతి ఫోన్‌లో సంప్రదించగా ఎవరూ స్పందించలేదు.

Updated Date - 2021-10-30T05:04:07+05:30 IST