ధాన్యాన్ని వెంటనే ఎగుమతి చేయాలి: భట్టి

ABN , First Publish Date - 2021-05-18T06:01:14+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించటంతోపాటు మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ధాన్యాన్ని వెంటనే ఎగుమతి చేయాలి: భట్టి
ముత్తారంలో రైతులో మాట్లాడుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ముదిగొండ, మే 17: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించటంతోపాటు మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మండలంలోని ముత్తారం, వల్లభి, మేడేపల్లి గ్రామాల్లోని ఐకేపీ, సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.  భట్టి విక్రమార్క రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు చేయకపోగా వర్షానికి తడిచిపోయి రంగుమారటంతో దిగుమతి అయిన మిల్లర్లు పేచీలు పెట్టి 3నుంచి 7కిలోల వరకు తరుగు పేరుతో కోత విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని భట్టి విక్రమార్క ముందు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మిల్లర్లు అలా కోత విధిస్తుంటే అధికారులు ఏంచేస్తున్నారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క పోన్లో జిల్లా అధికారులతో మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించటంతోపాటు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కొమ్మినేని రమేష్‌, మాజీ జడ్పీటీసీ మందరపు నాగేశ్వరరావు, మల్లెల అజయ్‌, బుచ్చిరామయ్య, రమేష్‌, రవి, అన్వేష్‌, ఏలూరి భాస్కర్‌, రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-18T06:01:14+05:30 IST