చెత్త తరలింపునకు అవాంతరాలు
ABN , First Publish Date - 2021-07-27T05:08:55+05:30 IST
నగరంలోని చెత్త తరలింపు ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకుంటున్నారు. చెత్తను డంపింగ్యార్డుకు తరలిం చకుండా తమ ప్రాంతాల్లోనే డంప్ చేస్తున్నారని, దీంతో విపరీతమైన దుర్వాసన వస్తోందని, వర్షాలు పడుతుంటడంతో రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
డంపింగ్యార్డుకు తరలించకుండా అడ్డుకుంటున్న వైనం
ఖమ్మం కార్పొరేషన్, జూలై26: నగరంలోని చెత్త తరలింపు ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకుంటున్నారు. చెత్తను డంపింగ్యార్డుకు తరలిం చకుండా తమ ప్రాంతాల్లోనే డంప్ చేస్తున్నారని, దీంతో విపరీతమైన దుర్వాసన వస్తోందని, వర్షాలు పడుతుంటడంతో రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. అందుకే ట్రాక్టర్లను అడ్డుకుంటున్నామని పేర్కొంటున్నారు. ఆదివారం రాపర్తి నగర్ సమీపంలోని బీసీకాలనీ వద్ద చెత్త తరలించే ట్రాక్టర్లను అడ్డుకోవటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు
డంపింగ్యార్డుకు తరలించక పోవటంతో
డంపింగ్యార్డు వరకు చెత్తను తరలించకపోవటంతో సమస్య ఏర్పడుతున్నది. గతంలో దానవాయిగూడెంలో చెత్త డంపింగ్యార్డును ఏర్పాటు చేశారు. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ డంపింగ్యార్డును ఏర్పాటు చేయగా, అందులో పేరుకు పోయిన చెత్తకు తరచూ నిప్పు అంటించటంతో, దానవాయిగూడెం, రామన్నపేటతో పాటు రాపర్తినగర్, బీసీకాలనీ, టీఎన్జీవో కాలనీ.ఖమ్మం నగరంలోని పలుప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. అంతే కాకుండా పేరుకుపోయిన చెత్తతో దుర్వాసన వచ్చేది. డంపింగ్యార్డును మార్చాలని ఆందోళనలు చేయటంతో ఎట్టకేలకు మల్లెమడుగు వద్ద డంపింగ్యార్డును ఏర్పాటు చేశారు. అయితే దూరం ఎక్కువ కావటం, రహదారి సరిగా లేకపోవటంతో డంపింగ్యార్డు వరకు వాహనాలు పోవటం లేదు.
అడ్డుకుంటున్న రెండు ప్రాంతాల ప్రజలు
మల్లెమడుగు వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్యార్డుకు వెళ్లాలంటే కామంచికల్, బీసీ కాలనీలనుండి వెళ్లాలి. అయితే డంపింగ్ యార్డు వరకు వెళ్లకుండా తమ పొలా ల్లోనే చెత్తను డంపింగ్ చేస్తున్నారని కామంచికల్లో ట్రాక్టర్లను ఇటీవల వరకు అడ్డుకున్నారు. ఆదివారం బీసీ కాలనీ మీదుగా చెత్త తరలిస్తుంటే అక్కడివారు అడ్డుకు న్నారు. పోలీస్బందోబస్తు మధ్య చెత్తను తరలించారు.
పేరుకు పోతున్న చెత్త
నగరంలో నిత్యం 200 మెట్రిక్టన్నుల చెత్త వస్తోంది. ట్రాక్టర్ల ద్వారా చెత్తను తరలించకపోవటంతో డివిజన్లలో పేరుకుపోతున్నది. ఇళ్లల్లో కూడా చెత్త పేరుకొని పోతున్నది. కాగా విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. మరి సమస్యకు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.