దేశానికే ‘ధరణి’ ఆదర్శం
ABN , First Publish Date - 2021-10-30T04:11:19+05:30 IST
దేశానికే ‘ధరణి’ ఆదర్శం
రిజిస్ర్టేషన్, మ్యుటేషన్ ఒకేసారి కావడంతో భూ వివాదాలు తగ్గాయి
ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్
ధరణి ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా వేడుకలు
ఖమ్మం, అక్టోబరు29(ఆంధ్రజ్యోతిప్రతినిధి)/ కొత్తగూడెం: ధరణి ప్రక్రియ ద్వారా ఒకేసారి రిజిస్ర్టేషన్, మ్యుటేషన్తో దేశంలోనే మెరుగైన సేవలందించే సౌలభ్యం లభించిందని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్ పేర్కొన్నారు. ధరణి పోర్టల్ సేవలు ప్రారంభించి ఏడాది సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టరేట్లలో వేడుకలు నిర్వహించి కేకులు కట్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో వారు మాట్లాడారు. ఏజెన్సీలోని మారుమూల గిరిజన గ్రామాల రైతులనుంచి విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ధరణి సేవలు పొందుతున్నారని అన్నారు. డబుల్రిజిస్ర్టేషన్లు, భూవివాదాలు ఉండడంలేదన్నారు. ఖమ్మం జిల్లాలో 26వేల మందికిపైగా ఈఏడాదిలో ధరణి ద్వారా జిల్లాలో సేవలు పొందారని వివరించారు. గతంలో ఖమ్మం జిల్లాలో ఏడు, భద్రాద్రిలో మూడు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలుంటే ఇప్పుడు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్లు కొనసాగుతున్నాయని వారు వివరించారు. ధరణిలో నిషేధిత జాబితాలో ఉన్న 5,660 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మంజిల్లాలోనే ఎక్కువ వివాదాలు, ఫిర్యాదులున్నాయని, వీటిని పరిష్కరించగలిగామన్నారు. ఖమ్మం జిల్లాస్థాయిలో ఇప్పటివరకు 12,264క్రయవిక్రయాలు, 7735 గిఫ్ట్ బదలాయింపులు, ఏజెన్సీలో 487బదలాయింపులు జరిగాయని, వారసత్వం 2944, మార్టిగేజ్ 3079 ధరణి ద్వారా ఈఏడాదిలో చేయడం చేశామన్నారు. ఈవిలేకరుల సమావేశాల్లో ఇరుజిల్లాల అదనపు కలెక్టర్లు మధుసూదన్, వెంకటేశ్వర్లు, ఖమ్మం డీఆర్వో అశోక చక్రవర్తి, ఖమ్మం, భద్రాద్రి ఆర్డీవోలు ఆర్డీవో రవీంద్రనాథ్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
