పోలవరం నుంచి భద్రాద్రిని రక్షించేందుకు

ABN , First Publish Date - 2021-02-06T04:09:06+05:30 IST

పోలవరం ముంపు నుంచి భద్రాచలంను రక్షించేందుకు ఈ నెల 11 నుంచి ఐదు రోజుల పాటు ప్రజా చైతన్య పాదయాత్రను నిర్వహిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏజే రమేష్‌ అన్నారు.

పోలవరం నుంచి భద్రాద్రిని రక్షించేందుకు
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఏజే రమేష్‌

ఐదు రోజుల పాటు ప్రజా చైతన్య పాదయాత్ర

సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏజే రమేష్‌


భద్రాచలం, ఫిబ్రవరి 5: పోలవరం ముంపు నుంచి భద్రాచలంను రక్షించేందుకు ఈ నెల 11 నుంచి ఐదు రోజుల పాటు ప్రజా చైతన్య పాదయాత్రను నిర్వహిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏజే రమేష్‌ అన్నారు. భద్రాచలంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనమాట్లాడుతూ పోలవరం వలన భద్రాచలం తీవ్ర ముంపుకు గురయ్యే అవకాశం ఉందన్నారు. భద్రాద్రి రామాలయానికి సైతం ముంపు గండం పొంచి ఉందని, దీనిని పాలక ప్రభుత్వాలు గుర్తించడం లేదన్నారు. ఏపీ ప్రభుత్వం తమ అవసరాల కోసం పోలవరం పనుల్లో వేగం పెంచిందని అన్నారు. కోర్టులు అభ్యంతరాలు తెలుపుతున్నా పనులు ఆపకుండా ముందుకు సాగుతుండటంతో భద్రాచలానికి పోలవరంతో ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.


భద్రాద్రి రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రూ.100 కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. పాదయాత్రను భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబురావు, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారు రవికుమార్‌  ప్రారంభించనుండగా ముగింపు కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శనరావు, భద్రాద్రి జిల్లా సీపీఎం కార్యదర్శి అన్నవరపు కనకయ్య హాజరవుతారని తెలిపారు. ఈ పాదయాత్రలో ఎంబీ నర్సారెడ్డి, వై.రామారావు, బండారు శరత్‌బాబు, భీమవరపు వెంకటరెడ్డి, మర్లపాటి రేణుక పాల్గొంటారని ఆయన వివరించారు. 

Updated Date - 2021-02-06T04:09:06+05:30 IST