మెరుస్తున్న పత్తి

ABN , First Publish Date - 2021-10-30T04:07:31+05:30 IST

మెరుస్తున్న పత్తి

మెరుస్తున్న పత్తి
ఖమ్మం మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన పత్తి

జూలూరుపాడులో క్వింటా రూ.8250, ఖమ్మంలో రూ.8,100

జూలూరుపాడు/ఖమ్మం మార్కెట్‌, అక్టోబరు 29:పత్తి మెరుపులు మెరు స్తోంది. రోజురోజుకు ధర పెరుగుతోంది. గతంలో కంటే ఈ ఏడాది సాగు తగ్గగా..ఉత్పత్తి లేకపోవడంతో పత్తికి డిమాండ్‌ పెరిగింది. ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లలో కూడా ఉమ్మడి జిల్లా పత్తికి గిరాకీ ఉండడంతో ఇక్కడ వ్యాపారులు ఆ మార్కెట్లకు పత్తిని తరలిస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదే శ్‌, కర్ణాటకతోపాటు, తెలంగాణలోని పలు ప్రాంతాలకు వ్యాపారులు పత్తిని తరలించి విక్రయిస్తున్నారు. శుక్రవారం జూలూరుపాడు ఉపమార్కెట్‌ యార్డులో వ్యాపారులు 3వేల క్వింటాలకు పైగా పత్తిని కొనుగోలు చేశారు. జెండా పాట రూ.8250పలకగా.. వ్యాపారులు పంట నాణ్యత మేరకు రూ.7600నుంచి రూ.7900వరకు కొనుగోలు చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో తెల్లబంగారం ధర పెరుగుదల కొనసాగుతోంది. శుక్రవారం వ్యాపారులు క్వింటా పత్తిని రూ. 8,100కు కొనుగోలు చేశారు. వారం క్రితం రూ.7,700 పలికిన ధర ఆ తరువాత రోజుకు రూ.100 నుంచి రూ.200  పెరుగుతుండగా.. రెండు రోజులుగా వ్యాపారులు క్వింటా రూ.8,000కు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం మరో రూ.100 అధికంగా పెట్టి కొనుగోలు చేశారు. పత్తికి కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర రూ. 6,025 కాగా మద్ధతు ధరను మించి క్వింటాలుకు రూ.2,000నుంచి రూ.2,100వరకు  అదనంగా ధర లభిస్తోంది. వానాకాలం సీజన్‌ కొత్త పత్తికి ఈ సీజన్‌లోనే అత్యధిక ధరపలకడం కూడా ఇదే తొలిసారి. ప్రైవేటు వ్యాపారులు ప్రభుత్వ ఎమ్మెస్పీ ధర కంటే అదనంగా కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే క్వింటా రూ.9,000లు ధర లభించ వచ్చని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. శుక్రవారం మార్కెట్‌కు సుమారు 7వేల బస్తాల పత్తి రాగా.. కొనుగోళ్లను మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ డౌలె లక్ష్మీప్రసన్న, సెక్రెటరీ రుద్రాక్షల మల్లేశం, ఏఎస్‌ రాజేంద్రప్రసాద్‌ పర్యవేక్షించారు. 

Updated Date - 2021-10-30T04:07:31+05:30 IST