పనులు వద్దు.. చదువే ముద్దు
ABN , First Publish Date - 2021-12-08T04:24:32+05:30 IST
మండలంలో చాలా గ్రామాల్లో విద్యార్థులు అవగాహనాలోపంతో ఇంటర్ విద్యకు దూరం ఆవుతున్నారు. మండల కేంద్రంలో అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నప్పటికీ కేవలం ప్రవేశాలకే పరిమితం అవుతున్నారు.
![పనులు వద్దు.. చదువే ముద్దు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921120710525486/12072021225358n74.jpg)
విద్యార్థులను కళాశాలకు పంపాలి
ఇంటింటికీ తిరుగుతూ గుండాల ప్రిన్సిపాల్ ప్రచారం
గుండాల, డిసెంబరు 7: మండలంలో చాలా గ్రామాల్లో విద్యార్థులు అవగాహనాలోపంతో ఇంటర్ విద్యకు దూరం ఆవుతున్నారు. మండల కేంద్రంలో అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నప్పటికీ కేవలం ప్రవేశాలకే పరిమితం అవుతున్నారు. ఆర్దిక స్థోమత లేకపోవడం, వ్యవసాయ పనులకు పరిమితమై పరీక్షలకు మాత్రమే హాజరవు తుండటంతో ప్రిన్సిపాల్ నవీన జ్యోతి ఆధ్వర్యంలో కళాశాల సిబ్బంది వినూత్నంగా ప్రచారం చేపట్టారు. ఏజెన్సీ గ్రామా ల్లోని విద్యార్దుల ఇంటింటికీ తిరుగుతూ పిల్లలను కళాశాలకు పంపించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నవీన జ్యోతి మాట్లాడుతూ కొవిడ్ కారణంగా రెండేళ్లపాటు విద్యార్థులు చదువుకు దూరమయ్యారన్నారు. కళాశాలలు పునఃప్రారంభమైనా తరగతులకు హాజరు కావడం లేదన్నారు. ఈ ఏడాది 206 మంది ప్రవేశం పొందగా, కేవలం 20శాతానికి మించి విద్యార్థులు కళాశాలకు హాజరు కావడంల లేదన్నారు. ప్రతీ గ్రూపులో ఒకరు, ఇద్దరు హాజరవుతుండటంతో విద్యా బోధన జటిలంగా మారిందన్నారు. దూరప్రాంత పేద విద్యార్థులు హాస్టల్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు.