మానవ నడతకు మార్గదర్శి రాముడు

ABN , First Publish Date - 2021-09-04T05:27:39+05:30 IST

మానవ నడతకు మార్గదర్శి రాముడు

మానవ నడతకు మార్గదర్శి రాముడు
పూర్ణాహుతిలో పాల్గొన్న చిన్నజీయర్‌స్వామి

శ్రీమద్భాగవత సప్తాహ మగింపు కార్యక్రమంలో చిన్నజీయర్‌స్వామి

భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు

భద్రాచలం, సెప్టెంబరు 3: మానవ నడతకు మార్గ దర్శి శ్రీరామచంద్రమూర్తి అని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి అన్నారు. శుక్రవారం భద్రాచలం సీతా రామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక చిత్ర కూట మండపంలో నిర్వహిస్తున్న  శ్రీమద్భాగవత సప్తాహ పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ త్వానికి ప్రతిరూపంగా నిలిచిన శ్రీరాముడు సమాజంలో ఎలా మెలగాలో ఆచరణలో చూపారని, అదేవిధంగా దైవానికి మారురూపంగా శ్రీకృష్ణుడుగా కూడా నిలిచార న్నారు. దైవం, మానవత్వాల కలయికే మానవ జన్మని చినజీయర్‌స్వామి పేర్కొన్నారు. రామాలయ ప్రాంగణం లో శ్రీమద్భాగవత సప్తాహాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. రాముడు కొలువై ఉన్న భద్రాద్రి క్షేత్రంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణునికి పూజలు జరగడం దైవ మహత్మ్యమని, ఆయా కాలాలకు తగ్గట్టుగా ఆనాటి అవసరాల కోసం వివిధ రూపాల్లో ప్రత్యేక గుణాలతో స్వామి అవతరించారన్నారు. అవతారాలు ఏవైనా దైవం ఒక్కటేనని ఉద్ఘాటించారు. కరోనాను ఎదుర్కొనేలా అందరూ విశ్వాసాన్ని, మనోబలాన్ని పెంచుకోవాలని, రామయ్య భక్తులందరికీ ఆ మనోఫలాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది సప్తాహం నిర్వహణను చేపట్టిన స్థానాచార్యులు కేఈ స్థలశాయిని చినజీయర్‌ ఘనంగా సత్కరించారు. అనంతరం భద్రాద్రి రామ య్యను దర్శించేందుకు ఆయన వెళ్లగా దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో దేవస్థానం ఈవో బి.శివాజీ, ఏఈవో శ్రవణ్‌కుమార్‌, వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ఆలయ ప్రధాన అర్చకులు అమరవాది విజయరాఘవన్‌, పొడిచేటి సీతారామానుజాచార్యులు, వైదిక, పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి భద్రాచలంలోని రాజవీధిలో ఉన్న జీయర్‌మఠానికి చేరు కున్న చిన్నజీయర్‌స్వామి రాత్రి బస అనంతరం శుక్ర వారం శ్రీరంగనాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హించి భక్తులకు తీర్ధగోష్టి నిర్వహించారు. ఆయన వెంట అహోబిల రామానుజ జీయర్‌స్వామి సైతం ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో వికాస తరంగిణి, జీయర్‌మఠం, జీయర్‌ ట్రస్టుకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

ముగిసిన శ్రీమద్భాగవత సప్తాహం

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న శ్రీమద్భాగవత సప్తాహం శుక్రవారంతో ముగిసింది. గత నెల 27న అంకురార్పణ జరగ్గా.. ప్రతి రోజు ఆరాధన, నిత్యపూజలు, హోమం తదితర కార్యక్రమాలను భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ఈ క్రమంలో శుక్రవారం పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. 



Updated Date - 2021-09-04T05:27:39+05:30 IST