భద్రాద్రి ఏరియా వైద్యశాలకు మరోసారి ‘కాయకల్ప’
ABN , First Publish Date - 2021-07-04T05:09:07+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2020-21 వార్షిక సంవత్సరానికి రాష్ట్రస్థాయిలో కాయకల్ప అవార్డుల్లో 2020-21 వార్షిక సంవత్సరానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఎంపికైంది. ఇదేవిధంగా పీహెచ్సీల విభాగంలో చర్ల మండలంలోని సత్యనారాయణపురం పీహెచ్సీ ఎంపిక కాగా, అప్పర్ ప్రైమరీ హెల్తు సెంటర్లలో(యుపీహెచ్సీ) సపాయిబస్తీ ఎంపికైంది.
14 పీహెచ్సీలకు ప్రశంసా పత్రాలు
భద్రాచలం, జూలై 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2020-21 వార్షిక సంవత్సరానికి రాష్ట్రస్థాయిలో కాయకల్ప అవార్డుల్లో 2020-21 వార్షిక సంవత్సరానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఎంపికైంది. ఇదేవిధంగా పీహెచ్సీల విభాగంలో చర్ల మండలంలోని సత్యనారాయణపురం పీహెచ్సీ ఎంపిక కాగా, అప్పర్ ప్రైమరీ హెల్తు సెంటర్లలో(యుపీహెచ్సీ) సపాయిబస్తీ ఎంపికైంది. కాగా జిల్లాలోని 14ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కాయకల్ప కింద ప్రశంసా పత్రాలను ప్రకటించారు. ఇదిలా ఉండగా భద్రాచలం ఏరియా వైద్యశాలకు 2016-17లో తొలిసారి రాష్ట్రస్థాయిలో కాయకల్ప అవార్డు సాధించింది. 2017-18లో రెండోస్థానంలో నిలువగా 2018-19లో మళ్లీ ప్రథమస్థానంలో నిలిచింది. కాగా 2020-21లో మరోసారి కాయకల్పలో భద్రాచలం ప్రథమస్థానంలో నిలవడం విశేషం. రాష్ట్రస్థాయిలో ఉత్తమ సేవలందించినందుకుగాను ప్రభుత్వం ఈ అవార్డులను ప్రతి ఏటా అందిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం సాధించిన ఏరియా వైద్యశాలకు రూ.20 లక్షలను, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. శనివారం ప్రకటించిన కాయకల్ప అవార్డుల్లో రాష్ట్రస్థాయిలో భద్రాచలం మరోసారి ప్రథమస్థానం రావడంతో ఏరియా వైద్యశాల అధికారులు, సిబ్బంది హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కొత్తగూడెంలోని సఫాయిబస్తీ యుపీహెచ్సీలు సైతం తమ తమ విభాగాల్లో ప్రథమస్థానాలు దక్కించుకోవడం పట్ల వైద్యఆరోగ్యశాఖ వర్గాల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. కాయకల్ప అవార్డులను ప్రకటించిన క్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో పోత్రు గౌతమ్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. కాగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శిరీష, డీసీహెచ్ఎస్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు, అడిషనల్ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ శ్రీనివాస్, డిప్యుటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ మోకాళ్ల వెంకటేశ్వరరావు, భద్రాచలం ఏరియా వైద్యశాల డిప్యుటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రామకృష్ణ ఆనందం వ్యక్తం చేస్తూ తమ వైద్యులను, సిబ్బందిని అభినందించారు.