మణుగూరు ఓసీలో ప్రమాదం
ABN , First Publish Date - 2021-06-03T05:30:00+05:30 IST
ఏరియాలోని మణుగూరు ఓసి గనిలో గురువారం మద్యాహ్నం జరిగిన ప్రమాదంలో వీపీఆర్ఓబీ కంపెనీకి చెందిన కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
కాంట్రాక్ట్ కార్మికుడు మృతి
మణుగూరు, జూన్ 3: ఏరియాలోని మణుగూరు ఓసి గనిలో గురువారం మద్యాహ్నం జరిగిన ప్రమాదంలో వీపీఆర్ఓబీ కంపెనీకి చెందిన కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సింగరేణి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మణుగూరు ఓసీలోని ఆఫ్లోడింగ్ ఏరియాలో మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వర్షం కారణంగా గని అంతర్గత రహదారులను లెవల్ చేసేందుకు కోమాట్సు కంపెనీకి చెందిన రోడ్డు వెవలింగ్ గ్రేడర్-3తో పనులు నిర్వహిస్తుండగా కె సత్యనారాయణ(55) గనిలోని ప్రధాన జంక్షన్లో ఉన్న కన్వీనియన్స్ వాహనం దగ్గరకు వెళ్తున్న సమయంలో గ్రేడర్ వెనుక టైర్ కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చందాడు. సమాచారం తెలిసిన వెంటనే సింగరేణి అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పినపాక మండలానికి చెందిన సత్యనారాయణకు నలుగురు సంతానం ఉన్నట్లు తెలిసింది. కాగా డంపింగ్ యార్డ్ ఇన్చార్జ్గా వ్యవరిస్తున్న సత్యనారాయణకు వర్షం కారణంగా అంతర్గత రహదారులపై నిలిచిన నీటిని మళ్లించి రోడ్డు లెవల్ చేసే పనులు అప్పగించగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. బాధిత కుటుంబాన్ని సింగరేణి యాజమాన్యం అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఇఫ్టూ నేత నాసర్పాషా డిమాండ్ చేశారు.