ద్విచక్రవాహనం, ఆటో ఢీ
ABN , First Publish Date - 2021-04-17T05:10:46+05:30 IST
ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్న సంఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు మృతి చెందగా, ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలైన సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల పొలీస్స్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగింది.
ఇద్దరు మృతి, మరో ఇద్దరు చిన్నారులకు గాయాలు
ఖమ్మం జిల్లా కొణిజర్ల వద్ద ప్రమాదం
సంఘటనను చూసి చలించిన ఎంపీ నామా
కొణిజర్ల, ఏప్రిల్ 16: ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్న సంఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు మృతి చెందగా, ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలైన సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల పొలీస్స్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగింది. కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామానికి చెందిన దేవళ్ల వెంకన్న, అతడి పిన్ని కూతురు తురక లక్ష్మి, ఆమె కుమారులు తురక వెంకటేష్, తురక ఉపేందర్ కొణిజర్లలోని బంధువుల ఇంట్లో గురువారం రాత్రి జరిగిన శుభకార్యానికి హాజరై రాత్రిపూట అక్కడే ఉండి శుక్రవారం ఉదయం పల్లిపాడుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో కొణిజర్ల పొలీస్స్టేషన్ దాటిన తర్వాత ఎదురుగా వైరా వైపు నుంచి కొణిజర్ల వస్తున్న ఆటో వారి బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు చెల్లాచదురుగా ఎగిరిపడ్డారు. దేవళ్ల వెంకన్న(34) అక్కడికక్కడే మృతి చెందాడు. తురక లక్ష్మీ(28) ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారులు వెంకటేష్, ఉపేందర్కు తీవ్రగాయాలవగా వారిని ఆసుపత్రికి తరలించారు. అన్నా చెల్లెళ్లు వెంకన్న, లక్ష్మీ మృతి చెందడంతో పల్లిపాడు గ్రామంలో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. మృతుడి తండ్రి జయరాజు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని కొణిజర్ల ఎస్ఐ మొగిలి తెలిపారు.
మానవత్వం చాటుకున్న ఎంపీ నామా..
ప్రమాదం జరిగిన సమమయంలో ఖమ్మం నుంచి వైరా వైపు వెళుతున్న ఎంపీ నామా నాగేశ్వరరావు ఘటనను చూసి వెంటనే తమ వాహనాన్ని ఆపారు. ఘటన జరిగిన తీరును తెలుసుకుని చలించిపోయారు. వెంకన్న మృతదేహాన్ని పరిశీలించి, తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న లక్ష్మిని, ఆమె కుమారులు వెంకటేష్, ఉపేందర్ను తన వాహనంలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి పంపించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఫోన్లో సూచించారు. సంబంధిత అధికారులకు ప్రమాద సమాచారాన్ని అందజేసి.. మానవత్వం చాటుకున్నారు.