మానేరు వాగులో కొట్టుకుపోయిన యువకులు

ABN , First Publish Date - 2021-08-27T06:55:12+05:30 IST

ఎల్లారెడ్డిపేట మండలం పదిర- రామలక్ష్మణపల్లి గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగులో కొట్టుకుపోతున్న ఇద్దరిని స్థానిక యువకులు రక్షించారు.

మానేరు వాగులో కొట్టుకుపోయిన యువకులు
సురక్షితంగా బయట పడిన వారితో పదిర యువకులు

- రక్షించిన స్థానిక యువకులు

 ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 26 : ఎల్లారెడ్డిపేట మండలం పదిర- రామలక్ష్మణపల్లి గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగులో కొట్టుకుపోతున్న ఇద్దరిని స్థానిక యువకులు రక్షించారు. వీర్నపల్లి మండలం మద్దిమల్లకు చెందిన సునీల్‌, లింగం అనే యువకులు బైక్‌పై పదిర మీదుగా రామలక్ష్మణపల్లి నుంచి ముస్తాబాద్‌కు వెళుతున్నారు. రెండు గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు నీటిలో గురువారం రాత్రి వాహనం అదుపు తప్పి కొట్టుకుపోయారు. సమీపంలోని బండరాయి మీదకు చేరుకుని రక్షించమని కేకలు వేయడంతో సమీపంలో ఉన్న పదిర గ్రామానికి చెందిన కర్ణ, రాజిరెడ్డి, లక్ష్మారెడ్డి, నరేశ్‌, నిఖిల్‌లు వాగు నీటిలో చిక్కుకున్న యువకులను రక్షించి బయటకు తీసుకువచ్చారు. వాహనం కొంత దూరం కొట్టుకుపోతుండడంతో తాళ్ల సహాయంతో బయటికి తీశారు. నీటిలో కొట్టుకుపోతున్న వారిని కాపాడిన పదిర యువకులను పలువురు అభినందించారు.

వరుస ఘటనలు :

నాలుగు రోజుల్లో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ రహదారి గుండా ప్రయాణించే వారు వాగు నీటి ఉధృతిలో చిక్కుకుంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. వాగు ఉధృతిని గుర్తించక అందులో నుంచి ప్రయాణించడం వల్ల కొట్టుకుపోతున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా పదిర, రామలక్ష్మణపల్లి గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.  


Updated Date - 2021-08-27T06:55:12+05:30 IST