నగర అభివృద్ధే ధ్యేయం

ABN , First Publish Date - 2021-12-25T05:36:28+05:30 IST

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే నగరపాలక సంస్థ పాలకవర్గ ధ్యేయమని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు.

నగర అభివృద్ధే ధ్యేయం
సమావేశంలో మాట్లాడుతున్న మేయర్‌ వై సునీల్‌రావు

- అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోం

- రాజకీయ లబ్ధి కోసం కరీంనగర్‌ ప్రజలకు అన్యాయం చేయద్దు 

- ఎంపీ బండి సంజయ్‌పై మేయర్‌ సునీల్‌రావు ధ్వజం 


కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 24: ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే నగరపాలక సంస్థ పాలకవర్గ ధ్యేయమని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు. శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్‌లో జరుగుతున్న స్మార్ట్‌సిటీ పనుల్లో నాణ్యతలేదని, పనులు నత్తనడకన సాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకుండా నీరుకారుస్తోందని ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ కేంద్రమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని అన్నారు. అదే నిజమైతే రాజకీయజన్మనిచ్చిన కరీంనగర్‌లో అభివృద్ధిని అడ్డుకొని ప్రజలకు అన్యాయం చేయడం తప్ప మరొకటి కాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం నగర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊర్కోమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కరీంనగర్‌ను మాత్రమే స్మార్ట్‌సిటీకి ఎంపిక చేయలేదని, దేశవ్యాప్తంగా 100 నగరాలను స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చారని, మన రాష్ట్రంలో కరీంనగర్‌, వరంగల్‌ను ఎంపిక చేసిందని చెప్పారు.   సీఎం కేసీఆర్‌ చొరవ, ఆనాటి ఎంపీ వినోద్‌కుమార్‌, మంత్రి గంగుల కమలాకర్‌తో కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ జాబితాలో చోటుదక్కిందని అన్నారు. ఆ సమయంలో కార్పొరేటర్‌గా ఉన్న సంజయ్‌ అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదని అన్నారు. స్మార్ట్‌సిటీకి ఎంపికైన కొన్ని నగరాల్లో పనులు కూడా ప్రారంభం కాలేదని, కావాలంటే బండి సంజయ్‌కి ఆ నగరాల జాబితాను ఇస్తామని చెప్పారు. రెండేళ్లుగా చేపడుతున్న స్మార్ట్‌సిటీ పనులతో నగర రోడ్లు అద్భుతంగా మారాయని, పనులు వేగంగా సాగుతుంటే ఏమాత్రం పరిజ్ఞానం లేకుండా సంజయ్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించిందని, వాటా విడుదల చేయలేదని, నత్తనడకన సాగుతున్నాయని ఫిర్యాదు చేయడం శోచనీయమని అన్నారు. నగర అభివృద్ధిని ఎంపీ సంజయ్‌ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని, ఈ చర్యలను నగరపాలక సంస్థ పాలకవర్గం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మొదటి విడత 196 కోట్ల నిధులు ఇస్తే, వాటితో అభివృద్ధి పనులు పూర్తి చేసిన ఘనత కరీంనగర్‌కే దక్కిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద వంద కోట్లు విడుదల చేసిన విషయం తెలుసుకోని దీనస్థితిలో ఎంపీ సంజయ్‌ ఉన్నారన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడ కూడా రాజీపడే ప్రసక్తే లేదని, థర్డ్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్‌ సర్టిఫై చేసిన తర్వాతనే బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. సమావేశంలో కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, నేతికుంట యాదయ్య, గుగ్గిళ్ల జయశ్రీ, వాల రమణారావు, కొలిపాక అంజయ్య, తోట రాములు, కాశెట్టి లావణ్యశ్రీనివాస్‌, కుర్ర తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-25T05:36:28+05:30 IST