గాలివాన బీభత్సం

ABN , First Publish Date - 2021-05-15T05:55:47+05:30 IST

ఎల్లారెడ్డిపేట మండలంలో శుక్రవారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. పెద్ద ఎత్తున ఈదురు గాలులతో కూడిన వర్షంతో మండల కేంద్రం, గొల్లపల్లి, బొప్పాపూర్‌, నారాయణపూర్‌, కోరుట్లపేట గ్రామాల్లో చెట్లు నేలకూలాయి.

గాలివాన బీభత్సం
బొప్పాపూర్‌లో వర్షం నీటిలో కొట్టుకుపోయిన ధాన్యం

- కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

- నేలకూలిన చెట్లు

- ఎగిరి పోయిన రేకులు

ఎల్లారెడ్డిపేట, మే 14: ఎల్లారెడ్డిపేట మండలంలో శుక్రవారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. పెద్ద ఎత్తున ఈదురు గాలులతో కూడిన వర్షంతో మండల కేంద్రం, గొల్లపల్లి, బొప్పాపూర్‌, నారాయణపూర్‌, కోరుట్లపేట గ్రామాల్లో చెట్లు నేలకూలాయి. ఇంటి రేకులు లేచిపోయి విద్యుత్‌ తీగలకు తగలడంతో  తెగిపోయాయి. కరెంటు స్తంభానికి  రేకులు చిక్కుకున్నాయి. విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వాన నీటి ప్రవాహానికి ధాన్యం కొట్టుకుపోయింది. కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. ధాన్యం రాసుల్లో నిలిచిన వర్షం నీటిని తొలగించేందుకు ఇబ్బందులు  ఎదుర్కొన్నారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. సుమారు 500 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయిందని రైతులు పేర్కొన్నారు.  

ఇల్లంతకుంట: మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసిపోయింది. వల్లంపట్ల, ఇల్లంతకుంట, పొత్తూర్‌, ఒగులాపూర్‌ గ్రామాల్లో తూకం వేయడంలో ఆలస్యంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరారు.

 ముస్తాబాద్‌:  మండలంలోని కొండాపూర్‌లో శుక్రవారం వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది.  రెండు రోజులకోసారి కురుస్తున్న వర్షంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరో పక్క టార్పాలిన్‌ల కొరత పెరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 వీర్నపల్లి: వీర్నపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో దాన్యం పూర్తిగా నీట మునిగిపోయింది.  మండల కేంద్రంలోని అంబేద్కర్‌ నగర్‌  కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. రోజుల తరబడి  కొనుగోళ్లు జరపడం లేదని,  ముందస్తు జాగ్రత్త   సూచనలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. వర్షం పడితే కప్పుకోవడానికి టార్పాలిన్‌లు తెచ్చుకుంటున్నామన్నారు.  

 కోనరావుపేట : కోనరావుపేట మండలంలో శుక్రవారం సాయంత్రం అకాల వర్షం రావడంతో  కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.  వారం రోజులుగా అకాల వర్షాలు పడడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2021-05-15T05:55:47+05:30 IST