కేసీఆర్కు బుద్ధి చెప్పడానికి ఇది మంచి అవకాశం
ABN , First Publish Date - 2021-10-08T05:03:56+05:30 IST
హుజూరాబాద్లో జరగనున్న ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్కు బుద్ధి చెప్పడానికి మంచి అవకాశమని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు.
![కేసీఆర్కు బుద్ధి చెప్పడానికి ఇది మంచి అవకాశం](https://media.andhrajyothy.com/appimg/galleries/1921100711323584/10072021233334n3.jpg)
ఈటల పట్ల ప్రజల నుంచి మంచి స్పందన ఉంది
డబ్బులతో ప్రజాస్వామ్యాన్ని కొనలేరు
ప్రతి ఇంటింకి లాభం చేసిన వ్యక్తి ఈటల
బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
హుజూరాబాద్, అక్టోబరు 7: హుజూరాబాద్లో జరగనున్న ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్కు బుద్ధి చెప్పడానికి మంచి అవకాశమని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఉప ఎన్నికల్లో ఈటల గెలుపు ఖాయమైందని, ఎంత మెజార్టీ వస్తుందనే చూస్తున్నామన్నారు. టీఆర్ఎస్ నేతలు ఎంత డబ్బు ఖర్చు చేసిన ఈటలపై ఉన్న ప్రేమను కొనలేరన్నారు. తన 20ఏళ్ల రాజకీయ జీవితంలో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి లాభం చేసిన వ్యక్తి ఈటల రాజేందర్ అన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో నష్టపోయిన ప్రజలు ఇబ్బందులు పడుతున్న బాల్క సుమన్ మాత్రం హుజూరాబాద్లో ప్రచారం చేస్తున్నారన్నారు. డబ్బులతో గెలవాలని చూస్తున్న వారి అహంకారానికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. డబ్బులతో ప్రజాస్వామ్యాన్ని కొనలేరని, కొనలని చూసే వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈటల పట్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తిగజారి పనిచేస్తుందని, సమైక్య పాలనలో ఈ విధంగా చేస్తే తెలంగాణ వచ్చేదా అని అన్నారు. ఏ ఎన్నికల్లో ఇలాంటి ప్రలోభాలు చూడలేదన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమావేశాలకు వచ్చే వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. చరిత్ర లిఖించే విధంగా ఫలితాలుంటాయన్నారు. 2023లో బీజేపీ అధికారం ఖాయమన్నారు. బీజేపీ అభ్యర్థిగా నేడు ఈటల రాజేందర్ నామినేషన్ వేస్తారని, నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్లు హాజరవుతారన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, టౌన్ కన్వీనర్ గంగిశెట్టి ప్రభాకర్, బీజేపీ సీనియర్ నాయకులు గంగిశెట్టి రాజు, దేవేందర్రావు తదితరులు పాల్గొన్నారు.