భయపెడుతున్న కరోనా
ABN , First Publish Date - 2021-04-14T06:06:45+05:30 IST
కరోనా పంజాకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు 150 మంది మృత్యువాత పడ్డారు. రెండో వేవ్లో ఏప్రిల్ మాసంలో 13 రోజుల్లో 14 మంది మృతిచెందారు.
- జిల్లాలో 150కి చేరిన మృతుల సంఖ్య
- తాజాగా ఇద్దరు మృతి... 120 మందికి పాజిటివ్
- జిల్లాలో చికిత్స పొందుతున్న 1743 మంది
- వేగంగా విస్తరిస్తున్న సెకండ్ వేవ్
- వ్యాక్సిన్ అస్వస్థతతో నేత కార్మికుడి మృతి
- మాస్క్లు లేకుండానే రోడ్డుపైకి
- పోలీసుల జరిమానా
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
కరోనా పంజాకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు 150 మంది మృత్యువాత పడ్డారు. రెండో వేవ్లో ఏప్రిల్ మాసంలో 13 రోజుల్లో 14 మంది మృతిచెందారు. మరోవైపు కరోనా వ్యాప్తి కలవరపెడుతోంది. వందల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో అధికారిక చర్యలు నామమాత్రంగానే ఉండడంతో భౌతికదూరం, మాస్క్లు ధరించకపోవడం సర్వసాధరణంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సవాలు పండుగలు, పబ్బాల పేరుతో సామూహికంగా కరోనా వ్యాప్తికి దోహదపడుతున్నారు. మంగళవారం పండుగ రోజు కూడా 654 మందికి ర్యాపిడ్ పరీక్షలు చేయగా 120 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఒకరు, నేరేళ్లలో 8 మంది, కోనరావుపేటలో 10 మంది, ఇల్లంతకుంటలో 11 మంది, పోత్గల్లో ముగ్గురు, ఎల్లారెడ్డిపేటలో 19 మంది, వేములవాడలో 41 మంది, చందుర్తిలో ఒకరు, బోయినపల్లిలో నలుగురు, సిరిసిల్లలో 22 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా చికిత్స పొందుతూ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో ఒకరు, హైదరాబాద్లో మరొకరు మృతిచెందారు. వేములవాడ మండలానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి 8న పాజిటివ్ వచ్చింది. సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన 60 ఏళ్ల మహిళ ఈ నెల 9న కరోనా బారిన పడింది. హైదరాబాద్లో చికిత్స పొందుతూ మరణించింది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన పవర్లూం నేత కార్మికుడు జక్కని లక్ష్మణ్ (48) ఈనెల 9న కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాడు. అస్వస్థతకు గురై సోమవారం రాత్రి మృతిచెందాడు. టీకా వేసకోవడంతోనే మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.
చికిత్స పొందుతున్నవారు 1743 మంది
జిల్లాలో కరోనా పాజిటివ్ రోజులతో పోటీపడుతోంది. ఇప్పటి వరకు 14021 మంది కరోనా బారిన పడ్డారు. 12128 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రెండో వేవ్లో జిల్లాలో 1743 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 13 రోజుల్లోనే 1621 మంది కరోనా బారిన పడ్డారు. 122 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. మంగళవారం ఇద్దరు మృతిచెందగా ఈ నెలలో 14 మంది కరోనాతో మృతిచెందారు. జిల్లాలో ఇప్పటి వరకు మృతిచెందిన వారిలో తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ముగ్గురు, నేరేళ్లలో ఇద్దరు, చీర్లవంచలో ఐదుగురు, కోనరావుపేటలో ఆరు గురు, ఇల్లంతకుంటలో నలుగురు, గంభీరావుపేటలో 9 మంది, పోత్గల్లో 12 మంది, ఎల్లారెడ్డిపేటలో 18 మంది, వేములవాడలో 34 మంది, చందుర్తిలో ఏడు గురు, బోయినపల్లిలో ఐదుగురు, విలాసాగర్లో ఒకరు, సిరిసిల్లలో 44 మంది మృతిచెందారు.