అనీమియా ముక్త్ జిల్లాగా మార్చాలి
ABN , First Publish Date - 2021-11-30T05:25:30+05:30 IST
బాలికలు, మహిళల్లో రక్తహీనత లేకుండా చర్యలు తీసుకుని అనీమియా ముక్త్ జిల్లాగా మార్చాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు.
- జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్
కరీంనగర్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బాలికలు, మహిళల్లో రక్తహీనత లేకుండా చర్యలు తీసుకుని అనీమియా ముక్త్ జిల్లాగా మార్చాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనీమియా ముక్త్ కరీంనగర్పై అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్థానిక సంస్థ అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగినులు, ప్రజాప్రతినిధులు, పాఠశాలలు, కళాశాలల్లో చదివే బాలికలు, 14 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య గల మహిళలందరికీ రక్త పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు పరీక్షలు నిర్వహించి రక్తహీనత ఉన్నవారికి ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వాలని సూచించారు. 30వ తేదీ నుంచి వచ్చే నెల 21 వరకు రక్త పరీక్షలను చేయాలని తెలిపారు. పోషకాహార ప్రాధాన్యాన్ని మహిళలకు వివరించాలన్నారు. అనంతరం రక్తహీనత-తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ముద్రించిన మూడు రకాల పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా సంక్షేమాధికారి బి రవీందర్, డీఎంహెచ్వో డాక్టర్ జువైరియా, డీఆర్డీవో శ్రీలత, డీపీవో వీరబుచ్చయ్య, డీసీవో శ్రీమాల, మార్కెటింగ్శాఖ ఏడీ పద్మావతి, మున్సిపల్ కమిషనర్ యాదగిరిరావు, డీఈవో జనార్దన్రావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రాజ్యలక్ష్మీ, డిప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.