శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-04-21T06:24:04+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవుతున్న నేపథ్యంలో నగరంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని శానిటరీ అధికారులను, సిబ్బందిని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వల్లూరి క్రాంతి ఆదేశించారు.
-మాస్క్లు ధరించకుంటే జరిమానా
-మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వల్లూరి క్రాంతి
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 20: కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవుతున్న నేపథ్యంలో నగరంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని శానిటరీ అధికారులను, సిబ్బందిని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వల్లూరి క్రాంతి ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో శానిటరీ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి డివిజన్లో చెత్తాచెదారం తొలగించి బ్లీచింగ్ చేయించాలని ఆదేశించారు. నగరంలో మాస్క్లు పెట్టుకోని వారిని గుర్తించి జరిమానాలు విధించాలన్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించేలా చూడాలని కమిషనర్ అన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. కరోనాతో చనిపోయిన వారి గూర్చి సమాచారమస్తే వెంటనే మృతదేహాన్ని తరలించే చర్యలు తీసుకోవడంతో పాటు వారి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చి ప్రభుత్వ నిబంధనల మేరకు దహనసంస్కారాలు చేయాలని ఆమె సూచించారు. అలాగే కరోనా కేసులు వచ్చిన ప్రాంతాల్లో పారిశుధ్య పనులను విధిగా చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ త్రయంభకేశ్వర్, అసిస్టెంట్ కమిషనర్ రాజేశ్వర్, శానిటరీ సూపర్వైజర్ రాజమనోహర్ తదితరులు పాల్గొన్నారు.