‘పల్లె ప్రగతితోనే గ్రామ వికాసం’ విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-02-01T06:35:47+05:30 IST
జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుంచి అమలు కానున్న ‘పల్లె ప్రగతితోనే గ్రామ వికాసం’ అను కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గుగులోతు రవి అన్నారు.

కలెక్టర్ గుగులోతు రవి
జగిత్యాల, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుంచి అమలు కానున్న ‘పల్లె ప్రగతితోనే గ్రామ వికాసం’ అను కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గుగులోతు రవి అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ ఆప్ ద్వారా జిల్లా, ప్రత్యేక, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రవి మాట్లాడారు. పల్లెల అభివృద్ధే దేశాభివృద్ధిగా భావించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను నూటికి నూరు శాతం అమలు జరపాలన్న సంకల్పంతో గతంలో ధర్మపురి నియోజకవర్గంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన పల్లె ప్రగతి గ్రామ వికాసం కార్యక్రమం స్పూర్తిని అందించిందన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రగతితోనే కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. గ్రామస్థాయి సమస్యల పరిష్కారానికి ఎంపీడీఓలు, డిప్యూటీ తహసీల్ధార్లు, ఏపీఎంలు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు బృందాలుగా ఏర్పడాలన్నారు. వారంలో రెండు గ్రామాలను ముందుగానే ఎంపిక చేసుకొని మురుగు కాలువల నిర్వహణ, విద్యుత్ లూజ్ వైర్లు, వంగిపోయిన కరెంటు స్తంబాలు, మిషన్ భగీరథ సమస్యలు పరిశీలించాలన్నారు. వైకుంఠధామాలు, ఇంటింటికి నల్లానీరు అందించడం సంబందిత పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, జగిత్యాల ఆర్డీఓ మాధురి, పలువురు ప్రత్యేక అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.