ఆర్టీసీ సిబ్బంది సమష్టిగా పనిచేయాలి
ABN , First Publish Date - 2021-02-05T06:53:57+05:30 IST
ఆర్టీసీ క్లిష్టపరిస్థితుల్లో ఉందని, కరోనా వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చడానికి ఆర్టీసీ సిబ్బంది సమిష్టిగా పని చేయాలని హైదరాబాద్, కరీంనగర్ జోన్ ఈడీ పీవీ ముణిశేఖర్ సూచించారు.
![ఆర్టీసీ సిబ్బంది సమష్టిగా పనిచేయాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/2021020501215071/02052021012334n94.jpg)
కరీంనగర్ ఈడీ ముణిశేఖర్
కళ్యాణ్నగర్, ఫిబ్రవరి 4: ఆర్టీసీ క్లిష్టపరిస్థితుల్లో ఉందని, కరోనా వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చడానికి ఆర్టీసీ సిబ్బంది సమిష్టిగా పని చేయాలని హైదరాబాద్, కరీంనగర్ జోన్ ఈడీ పీవీ ముణిశేఖర్ సూచించారు. గురువారం ఆయన గోదావరిఖని డిపోను సందర్శించారు. డిపో ఆవరణలో మొక్కలను నాటారు. కరోనా సమయంలో ఆర్టీసీ ప్రగతి చక్రం ఆగిందని, తిరిగి సంస్థ అభివృద్ధి చెందాలంటే డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది సమర్థవంతంగా పని చేసి సంస్థకు పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రయాణికులతో మర్యాదగా నడుచుకుంటూ ఆర్టీసీ వైపు ఆకర్షించడం ద్వారా సంస్థ అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తే కలిగే అనర్థాలను ప్రయాణికులకు వివరించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం డిపోలో పని చేస్తున్న ప్రమాద రహిత డ్రైవర్లు రాజేశం, ఆర్కే మూర్తి, బీఆర్ స్వామిలను ఈడీ ముణిశేఖర్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి వారికి రివార్డును అందజేశారు. కార్యక్రమంలో కరీంనగర్ ఆర్ఎం శ్రీధర్, గోదావరిఖని డిపో మేనేజర్ వెంకటేశం, అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ కవిత, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.