పెండింగ్ కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి
ABN , First Publish Date - 2021-08-01T06:04:48+05:30 IST
పెండింగ్ కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు.
- డీజీపీ మహేందర్రెడ్డి
సిరిసిల్ల క్రైం, జూలై 31: పెండింగ్ కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. శనివారం జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో హైద్రాబాద్ డీజీపీ కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెండింగ్ కేసులు, ఫంక్షనల్ వర్టికల్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ పోలీసు అధికారులు కిందిస్థాయి సిబ్బందికి వారి అనుభవాలను ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, కేసుల్లో శిక్షల శాతం పెంచాలన్నారు. కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు తరుచుగా శిక్షణాతరగతులు నిర్వహించాలన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. తరుచుగా నేరాలకు పాల్పడే నేరస్థులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను గుర్తించాలన్నారు. కేసుల్లో త్వరగా పరిశోధన పూర్తిచేసి చార్జిషీట్ వేయాలన్నారు. గంజాయి, జూదం, గుట్కా ప్రభుత్వం నిషేధించిన హానికరమైన వస్తువులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సమూలంగా నిర్మూలించాలన్నారు. రిసెప్షన్ సిబ్బంది దరఖాస్తుదారుడితో మర్యాదగా వ్యవహరించి సమస్య పరిష్కరించే విధంగా భరోసా కల్పించాలన్నారు. కరుడుగట్టిన నేరస్థులపై పీడీ యాక్ట్ అమలు చేయాలన్నారు. ప్రతీ పోలీస్స్టేషన్లో తప్పకుండా 5ఎస్ విధానాన్ని అమలు చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ రాహుల్హెగ్డే, డీఎస్పీలు చంద్రశేఖర్, చంద్రకాంత్, రవికుమార్, సీఐలు అనిల్కుమార్, ఉపేందర్, మొగిలి, వెంకటేశ్, బన్సీలాల్, శ్రీలత, డీసీఆర్బీ సీఐ నవీన్కుమార్, ఎస్బీఐ సర్వర్లు పాల్గొన్నారు.