గోదాముకు తాళం వేసి రైతుల ఆందోళన
ABN , First Publish Date - 2021-11-26T06:31:47+05:30 IST
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం గోదాముకు రైతులు గురువారం తాళం వేసి ఆందోళనకు దిగారు.

ముస్తాబాద్, నవంబరు 25 : ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం గోదాముకు రైతులు గురువారం తాళం వేసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో కొనుగోళ్లు వేగంగా జరగడం లేదని మండిపడ్డారు. సేకరించిన ధాన్యాన్ని వెంటవెంటనే సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల తరబడి రోడ్లపైనే ధాన్యపు రాశులు పేరుకుపోతున్నాయని, టార్పాలిన్ కవర్ల కొనుగోలుకు వేలల్లో ఖర్చు అయి, ఆర్థిక భారం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు కొనుగోళ్లు వేగంగా జరిగేలా చూస్తామని, రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ టఇవ్వడంతో ఆందోళన విరమించారు.