దైన్యస్థితిలో కౌలు రైతులు

ABN , First Publish Date - 2021-12-26T06:02:22+05:30 IST

ఉప్పుడు బియ్యం తీసుకోబోమని కేంద్రం ప్రభుత్వం.. అయితే వరి పంట వేయవద్దని, వేస్తే ఉరేనని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో కౌలు రైతులు ధైన్య స్థితిలో ఉన్నారు.

దైన్యస్థితిలో కౌలు రైతులు

- వరికి ప్రత్యామ్నాయం లేక ఇక్కట్లు

- కౌలు సొమ్ము చేతికి వచ్చేదెలా?

- వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఉప్పుడు బియ్యం తీసుకోబోమని కేంద్రం ప్రభుత్వం.. అయితే వరి పంట వేయవద్దని, వేస్తే ఉరేనని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో కౌలు రైతులు ధైన్య స్థితిలో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కౌలు రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరకపోయినా, బతుకు రీత్యా భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయక తప్పడం లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు వారివి. యాసంగిలో వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం హుకుం జారీ చేయడంతో కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. భూయజమానులకు ఒకేసారి ఇచ్చిన కౌలు సొమ్ము ఎలా తిరిగి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. 

వరిపైనే ఆశలు..

సాగునీటి లభ్యత ఉన్నప్పుడు జిల్లాలో యాసంగి సీజన్‌లో 2 లక్షల 7 వేల ఎకరాల వరకు పంటలను రైతులు సాగు చేస్తుంటారు. ప్రస్తుతం ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, వ్యవసాయ, బోరు బావుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. యాసంగిలో ప్రతి ఏటా సాగు చేసే పంటల్లో అత్యధికంగా 90 శాతం వరి పంటనే వేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా తెగేసి చెప్పడంతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని, వరి పంట వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ప్రచారం చేస్తున్నది. అయితే పొలాల్లో బురద ఇప్పటికీ ఉండడంతో ప్రత్యామ్నాయ పంటలను పండించలేమని రైతులు అంటున్నారు. విత్తనోత్పత్తి కోసం ఆయా విత్తన కంపెనీలు, రైస్‌మిల్‌ వ్యాపారులు ధాన్యాన్ని తీసుకుంటామని హామీ ఇస్తేనే వరి పంటను సాగుచేయాలని అధికారులు చెబుతున్నారు. కౌలు రైతులు భూములను కౌలుకు తీసుకునేటప్పుడు ఏడాది కాలానికి ఒప్పందం కుదుర్చుకుంటారు. పట్టాదారులకు ఒకేసారి కౌలు సొమ్మును అందజేస్తుంటారు. జిల్లాలో ఎకరానికి రెండు పంటలకు గాను 20 నుంచి 25 వేల రూపాయల వరకు భూములను కౌలుకు తీసుకున్నారు. గడిచిన వానాకాలంలో అధిక వర్షాల వల్ల వరి పంటకు తెగుళ్లు సోకి పంట దిగుబడులు తగ్గిపోయాయి. ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల లోపే దిగుబడులు వచ్చాయి. దీంతో కౌలు రైతులు లాభాలేమో గానీ, పెట్టుబడులు కూడా దక్కలేదు. కనీసం యాసంగిలో పండించే పంట ద్వారానైనా నష్టాలను పూడ్చుకుందామనుకున్న రైతుల నెత్తిన పిడుగుపడినట్లుగా ధాన్యాన్ని కొనుగోలు చేయమని ప్రభుత్వం చెప్పింది. సాధారణంగా యాసంగి సీజన్‌లో పంట దిగుబడులు అధికంగా వస్తాయి. వరి పంట 30 నుంచి 38 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల కౌలు రైతులకు తీరని నష్టం వాటిల్లుతున్నది. కౌలు రైతులకు పంట రుణాలు, పంట నష్టాలు, రైతుబంధు, ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ యోజన, రైతు బీమా, ఇతరత్రా సబ్సిడీ పథకాలకు నోచుకోవడం లేదు. అసలు కౌలు రైతులంటేనే ప్రభుత్వాలకు గిట్టడం లేదు. కనీసం పండించే పంటనైనా కొనుగోలు చేసే దిక్కు లేకుంటే వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కౌలు రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 

Updated Date - 2021-12-26T06:02:22+05:30 IST