రుద్రంగిలో వడగళ్ల వర్షం
ABN , First Publish Date - 2021-04-22T06:19:01+05:30 IST
రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం కురిసిన వడగళ్ల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. మార్కెట్ యార్డు, ఐకేపీ, సింగిల్విండో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.
- వాతావరణ మార్పులతో ఆందోళన
- ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి
రుద్రంగి, ఏప్రిల్ 21 : రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం కురిసిన వడగళ్ల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. మార్కెట్ యార్డు, ఐకేపీ, సింగిల్విండో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. మార్కెట్ యార్డుకు రైతులు తెచ్చిన సుమారు 3 వేల క్వింటాళ్ల ధాన్యంలో వంద క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయినట్లు రైతులు తెలిపారు.
కోత దశలో నేలకొరిగిన వరి
రుద్రంగి మండల కేంద్రంలోని నల్లగుట్ట, నాగరం చెరువు, అచ్చయ్యకుంట, గోరిలాల్వ ప్రాం తంలో ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. భారీ వర్షనికి సూమారు 300 ఎకరాల నుంచి 400 ఎకరాల వరకు వరి పంట నేలకొరిగినట్లు మండల వ్యవసాయ అధికారి అనూష తెలిపారు. పూదరి జనార్దన్ అనే రైతుకు చెందిన ఐదు ఎకరాల వరి పంట కొత దశలో ఉండడంతో పూర్తిగా నేలకొరి గింది. దీంతో వరి గింజలన్నీ నేలరాలాయి.
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి
ఆకాల వర్షంతో తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కోనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. వర్షం నీటిలో ధాన్యం కొట్టుకు పోయిన రైతులను ప్రభుత్వం నష్ట పరిహారం అందిచాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరారు.