వాళ్ల నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తా..: ఈటల రాజేందర్
ABN , First Publish Date - 2021-11-03T17:02:01+05:30 IST
హుజురాబాద్లో ప్రచారం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల భరతం పడతానని ఈటల రాజేందర్ అన్నారు.
కరీంనగర్: హుజురాబాద్లో ప్రచారం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల భరతం పడతానని, వాళ్ల నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పచ్చని సంసారంలో నిప్పులు పోసినవారి నియోజకవర్గాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను గెలిపించిన హుజురాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. హుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. దళిత బంధు వాళ్ళ దగ్గర ఎందుకు రాలేదో నిలదీస్తానన్నారు.
తనకు అండగా ఉన్న కేంద్రమంత్రి అమిత్షాకు ఈటల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు చెప్పారు. హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ నేతలు వందల కోట్లు ఖర్చు పెట్టారని, డబ్బులు ఖర్చుపెట్టి ప్రజలను వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. హుజురాబాద్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిని కల్పించారన్నారు. కుల ప్రస్తావన తెచ్చినా..ప్రజలు తనవైపే నిలబడ్డారని, కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. ఇది కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన గెలుపుగా అభివర్ణించారు. కుట్రలు చేసేవారు.. ఆ కుట్రలతోనే నాశనం అవుతారన్నారు. హుజురాబాద్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఈటల స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ నీచపు, చిల్లర పనులు చేశారని ఈటల విమర్శించారు. ఆయన బొమ్మ, ఆయన గుర్తు మీదనే గెలుస్తారు అన్న అహంకారం ఉందని, టీఆర్ఎస్కే ఓట్లు వేయాలని పసుపు బియ్యంతో ప్రమాణం చేయించుకున్నారన్నారు. దళిత బంధు పది సార్లు ఇస్తామన్నా ధర్మం వైపే ప్రజలు నిలబడ్డారని, డబ్బులు పంచినోళ్ళను తన్ని తరిమేశారన్నారు. దమ్ముంటే మామా అల్లుడు పోటీ చేయాలని సవాల్ విసిరిన తెలంగాణలో దీపావళి నిన్ననే జరిగిందని ఈటల వ్యాఖ్యానించారు.