నగరంలో 60 ఓపెన్ జిమ్స్ ఏర్పాటు
ABN , First Publish Date - 2021-06-21T05:41:52+05:30 IST
నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దేందుకు నగరంలో 60 ఓపెన్ జిమ్స్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించామని మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు.
![నగరంలో 60 ఓపెన్ జిమ్స్ ఏర్పాటు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921062112095764/06212021001223n69.jpg)
- మొదటి విడతలో 3.60 కోట్లతో 30 ఏర్పాటు
- మేయర్ యాదగిరి సునీల్రావు
కరీంనగర్ టౌన్, జూన్ 20: నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దేందుకు నగరంలో 60 ఓపెన్ జిమ్స్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించామని మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. ఆదివారం నగరంలోని 7, 14, 53, 57 డివిజన్లలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్స్ను ఆయా డివిజన్ కార్పొరేటర్లతో కలిసి మేయర్ ప్రారంభించారు. 14వ డివిజన్ పరిధిలోని సప్తగిరికాలనీలో బైపాస్ రోడ్డులో ఏర్పాటుచేసిన జిమ్ను ప్రారంభించారు. 57వ డివిజన్ చైతన్యపురిలో కార్పొరేటర్ బండ సుమ రమణారెడ్డితో కలిసి జిమ్ను ప్రారంభించి కొద్దిసేపు మేయర్ వ్యాయామం చేశారు. అనంతరం 53వ డివిజన్ కాశ్మీరుగడ్డలో కార్పొరేటర్ శ్రీదేవి చంద్రమౌళి, ఏడవ డివిజన్ హౌసింగ్బోర్డు కాలనీలో ఆకుల పద్మ ప్రకాశ్తో కలిసి ఓపెన్ జిమ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్రావు మాట్లాడుతూ తమ పాలకవర్గం ఏర్పడిన రెండు నెలలకే కొవిడ్ మహమ్మారి ప్రారంభం కావడంతో ఓపెన్ జిమ్స్ ప్రారంభించడంలో ఆలస్యమైందని అన్నారు. మొదటి దశలో 30 ఓపెన్ జిమ్ములను ఒక్కొక్కటి 12 లక్షల చొప్పున ఏర్పాటు చేసి దాదాపుగా అన్నిటినీ ప్రారంభించామని, రెండు మాసాల్లో దాదాపు ఈ జిమ్స్ అన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రెండవ విడత మరో 30 ఏర్పాటు చేసేందుకు త్వరలోనే టెండర్లను నిర్వహించి వీలైనంత త్వరగా వాటిని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తామని చెప్పారు. ఓపెన్ జిమ్స్ను ఐదేళ్లు నిర్వహించేందుకు టెండర్లను నిర్వహిస్తామని, వారి ఆధ్వర్యంలో జిమ్స్ కొనసాగుతాయని చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న జిమ్స్ను, పార్కులు, వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మేయర్ సునీల్రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.