న్యాయం చేయండి..
ABN , First Publish Date - 2021-06-24T05:29:23+05:30 IST
మానేరు రివర్ ఫ్రంట్ కోసం భూములను ఇస్తే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని అలుగునూర్కు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
- మానేరు రివర్ ఫ్రంట్లో భూములు కోల్పోతున్నాం..
- కరీంనగర్ వైపు భూముల ధరలనే మాకూ చెల్లించాలి
- ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను కలిసిన అలుగునూర్ రైతులు
తిమ్మాపూర్, జూన్ 23: మానేరు రివర్ ఫ్రంట్ కోసం భూములను ఇస్తే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని అలుగునూర్కు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని క్యాంప్ కార్యలయంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణంలో తాము భూములు కోల్పోతున్నామని తెలిపారు. ఇప్పటికే 400 ఎకరాల భూమిని ఎస్సారెస్పీ నిర్మాణం జరిగిన సమయంలో ఇచ్చామన్నారు. రాజీవ్ రహదారి కోసం వంద ఎకరాలు, తీగల వంతెన నిర్మాణానికి 10 ఎకరాలు, కాకతీయ మెయిన్ కాలువ నిర్మాణానికి 80 ఎకరాలు ఇచ్చామన్నారు. ఇప్పుడు మానేరు రివర్ ఫ్రంట్ పేర భూములను తీసుకునే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ వైపు భూములకు అధిక పరిహారం లభిస్తుందని, తమకు కూడా అదే విధంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రైతులు అందోళన చెందవద్దు:రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే
కరీంనగర్ - అలుగనూర్ సరిహద్దుల్లో మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మిస్తున్నారు. ఇరువైపులా భూమిని సేకరిస్తున్నారు. అలుగునూర్ రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం.
మాకు న్యాయం చేయాలి: బుర్ర కనుకయ్య, రైతు, అలుగునూర్
నాకు వాగు ఒడ్డుకు 449 సర్వే నంబరులో మూడు ఎకరాల భూమి ఉంది. రివర్ ఫ్రంట్ భూ సేకరణలో నా భూమి మొత్తం పోతుంది. నాకు అప్పులున్నాయి. ఈ భూమి మీదే ఆధారపడి బతుకుతున్నాం. మాకు న్యాయం చేయాలి.