20వేల కుటుంబాలకు ఒకేరోజు దళితబంధు ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-08-03T06:26:10+05:30 IST
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒకేరోజు 20 వేల కుటుంబాలకు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు.
- వంద రోజుల్లో 118 నియోజకవర్గాల్లో పంపిణీ చేయాలి
- సెప్టెంబర్ 5న హుజూరాబాద్లో లక్ష మందితో సభ
- ఎస్సీ సమగ్ర అభివృద్ధి సాధన సదస్సులో నేతలు
సుభాష్నగర్, ఆగస్టు 2: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒకేరోజు 20 వేల కుటుంబాలకు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్లో ఎస్సీ సమగ్ర అభివృద్ధి సాధన సదస్సు ఉమ్మడి జిల్లా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితున్ని చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోలేదన్నారు. అంతేకాకుండా దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ప్రకటించారని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలు అమలుకాకపోవడంతో దళితబంధు పట్ల దళితులకు నమ్మకం లేకుండా పోయిందన్నారు. రైతుబంధు తరహాలో దళితబంధు అమలు చేయాలన్నారు. దళితులను సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు. అన్నిరంగాల్లో ఆధిపత్యం అగ్రకులాలదేనని, వెనుకబడ్డది దళితులేనన్నారు. తెలంగాణలో కళాకారుల పాత్ర కూడా ముఖ్యమైనదేనని, అందులో ధూంధాం కళాకారులు ముఖ్యమని కేసీఆర్ మాట్లాడారని అన్నారు. ఆ కళాకారుల్లో కూడా 95 శాతం మంది దళితులు ఉన్నారని, ఒక్క వెలమ కళాకారుడు కూడా లేడని అన్నారు. స్వరాష్ట్రం కోసం జైలుకు వెళ్లిన వారిలో కూడా 40 శాతం దళితవర్గాలేనని, జైలుకు వెళ్లినవారు ఆరు నెలలపాటు జైలులో ఉన్నది దళితవర్గాల బిడ్డలేనని అన్నారు. తెలంగాణ కోసం 1200 మంది అమరులయ్యారని, 600 మంది అని ప్రభుత్వం చెబుతున్నా అందులో ఒక్క వెలమ వర్గానికి చెందిన వారు కూడా లేరన్న విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్రంలో 20 లక్షల దళిత కుటుంబాలున్నాయని, కేవలం వారి చేతిలో 13 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉందని అన్నారు. 6,650 మంది లబ్ధిదారులకు 16 వేల ఎకరాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారని, జనాభా ప్రకారం ఒకశాతం భూమి కూడా ఇవ్వలేదన్నారు. ఒకవేల కేసీఆర్ ప్రకటించినట్లుగా దళితుడైన కడియం శ్రీహరి, కొప్పుల ఈశ్వర్లలో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే వందశాతం భూ పంపిణీ జరిగేదన్నారు. ఇందిరాగాంధీ హయాంలో దళితులకు ఇచ్చిన భూములను కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు, కలెక్టరేట్ భవన సముదాయల నిర్మాణాలు, వైకుంఠధామాల నిర్మాణం కోసం లాక్కున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 వేల ఎకరాల భూమి ఇచ్చి 75 నుంచి 80 వేల ఎకరాలు లాక్కున్నారని ఆరోపించారు. దళితులంటే కేసీఆర్కు ముందు నుంచి వ్యతిరేకత అని ఆరోపించారు. ముఖ్యమంత్రికి ఉన్న 11 మంది సలహాదారుల్లో ఒక్కరు కూడా దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లేకపోవడం అందుకు నిదర్శనమన్నారు. అగ్రకులాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పదవీ విరమణ పొందితే వారిని ఘనంగా సన్మానించి సత్కరించి వారిని తిరిగి ప్రభుత్వ సలహాదారుగా నియమించారని ఆరోపించారు. అదే దళిత ఐఏఎస్ అధికారి ప్రదీప్చంద్ర చీఫ్ సెక్రటరీ స్థాయిలో పదవీ విరమణ పొందితే రోజువారి విధి నిర్వహణలోకి ఎలాగైతే వెళ్లాడో అలానే తిరిగి ఇంటికి వెళ్లారని అన్నారు. వంద రోజుల్లో 118 నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేయాలని కోరుతూ ఆగస్టు 9న అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నా, ఈ నెల 15లోగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులందరి ఖాతాల్లో రూ.10 లక్షలు జమ చేయకుంటే దళితవర్గాన్ని రోడ్లపైకి తీసుకువచ్చి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతాన్నారు. సెప్టెంబర్ 5న లక్ష మందితో హుజూరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.
ఫ కొద్దిసేపు ఉద్రిక్త వాతారవణం...
సీనియర్ దళిత నాయకుడు మేడి మహేశ్ మాట్లాడుతూ రైతుబంధు, కల్యాణలక్ష్మీ పథకాన్ని దళితులు కూడా పొందుతున్నారని, రైతుబంధు కూడా అలాగే అమలవుతుందని అనడంతో అక్కడున్నవారు ఆయన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంజం వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోమాస శ్రీనివాస్, బొత్త వెంకటమల్లయ్య, మార్వాడి సుదర్శన్, బాబురావు, ఉస్మానియా విద్యార్థి నాయకుడు దుర్గం భాస్కర్, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, జిల్లా మాదిగ లాయర్ల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు మొలుగూరి సదయ్య, మాల మహానాడు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు యనమల మంజుల, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మారేపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.