భూముల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ABN , First Publish Date - 2021-02-27T05:15:24+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని భూముల సమగ్ర వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ భూ పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్లు పాఽశం యాదగిరి, గాదె ఇన్నయ్యలు డిమాండ్ చేశారు.

ధరణి పోర్టల్ టీఆర్ఎస్ పార్టీ కుంకుమ భరణిగా మారింది
తెలంగాణ భూ పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్లు పాశం యాదగిరి, గాదె ఇన్నయ్య
జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 26: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని భూముల సమగ్ర వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ భూ పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్లు పాఽశం యాదగిరి, గాదె ఇన్నయ్యలు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న లక్షలాది ఎకరాల భూములను, సర్ఫేఖాస్ ఆస్తులను, పాయిగా భూములను, ఏవెక్యూ ఆస్థులు , సీలింగ్, శిఖం తదితర భూములను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ టీఆర్ఎస్ పార్టీ కుంకుమ భరణిగా మారిందన్నారు. వందల ఏళ్ల కింద అమ్మిన భూముల్లో నేటికీ వారిపేర్లే ఉండడం శోచనీయం అన్నారు. బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ నేడు కేసీఆర్ కుటుంబ ఆస్తిగా మారిందని విమర్శించారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం మరోమారు ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు.గ్రామ గ్రామాన గ్రామ సభలు నిర్వహించి అన్ని సర్వే నెంబర్లు, బై నెంబర్లకు హక్కుదారులను నిర్ణయించాలన్నారు. గ్రామ సభ ద్వారా నిర్ణయించిన భూముల వివరాలను మాత్రమే ధరణి పోర్టల్లో నమోదు చేయాలన్నారు.షెడ్యూల్డ్ 5లో గల అటవీ భూములకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల అసైన్డ్ భూములకు ఆదివాసీ అటవీ భూములకు రైతుబంధు ఇవ్వాలని, గ్రానైట్ క్వారీలను నిలిపివేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు డొంకె రవి, మార్వాడి సుదర్శన్, గుర్రాల రవి, మెరుగు కుమారస్వామి, కస్తూరి విశాల్, ప్రజా సంఘాల జేఏసీ జిల్లా ఛైర్మెన్ అడ్లగట్ల గంగాధర్, నక్క చంద్రమౌళి తదితరులున్నారు.