వంద పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి
ABN , First Publish Date - 2021-05-21T06:14:31+05:30 IST
వేములవాడలో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

- కరోనాతో మృతి చెందిన వారికి 10 లక్షలు పరిహారం చెల్లించాలి
- పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్
వేములవాడ, మే 20 : వేములవాడలో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కొవిడ్తో మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వంద పడకల ఆసుపత్రిని పది రోజుల్లో ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించి నెల దాటిపోయినా ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదని అన్నారు. ఆసుపత్రిని వెంటనే ప్రారంభిస్తే ఎందరో కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందేదని అన్నారు. పట్టణాలతో పాటు పల్లెల్లోనూ కరోనా ఉధృతి కొనసాగుతోందని, చికిత్స అవసరమైన వారికి ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్స్ దొరకడం లేదని, ప్రైవేటు ఆసుపత్రులలో లక్షలాది రూపాయలు చెల్లించలేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఇప్పటికైనా వెంటనే వేములవాడలో వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని కోరారు. ఇతర రాష్ట్రాల తరహాలో కరోనాకు ఉచితంగా వైద్యం అందజేయాలని, కరోనాతో మృతి చెందిన వారికి పది లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వెంకటస్వామి, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.