HYD : కి‘లేడీ’ ఆటను కట్టించిన పోలీసులు.. ఈమె ఏం చేసిందో తెలిస్తే...!

ABN , First Publish Date - 2021-11-21T13:44:36+05:30 IST

ఆ తర్వాత మూడో బ్రాంచ్‌ని మహేశ్వరం ఎక్స్‌రోడ్‌లో ప్రారంభించింది..ll

HYD : కి‘లేడీ’ ఆటను కట్టించిన పోలీసులు.. ఈమె ఏం చేసిందో తెలిస్తే...!

హైదరాబాద్‌ సిటీ/జవహర్‌నగర్‌ : బైక్‌ స్కీముల పేరుతో 300 మంది అమాయకులకు కుచ్చుటోపీ వేసి.. రూ. 2కోట్లు కొల్లగొట్టిన కి‘లేడీ’ కేడీ ఆటను రాచకొండ పోలీసులు కట్టించారు. జవహర్‌నగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. బాలానగర్‌కు చెందిన కంకుల పల్లవిరెడ్డి పీర్జాదిగూడ పర్వతాపూర్‌లో నివసిస్తోంది. ఈమె 2019లో ఏఎస్‌రావునగర్‌లో శ్రీ సాయినిత్య ట్రేడర్స్‌ పేరుతో మల్టీబ్రాండ్‌ టూవీలర్స్‌ షోరూమ్‌ను ప్రారంభించింది. 2020లో దమ్మాయిగూడలో నిత్య మోటార్స్‌ పేరుతో మరో షోరూమ్‌ను.. ఆ తర్వాత మూడో బ్రాంచ్‌ని మహేశ్వరం ఎక్స్‌రోడ్‌లో ప్రారంభించింది. గొలుసుకట్టు(ఎంఎల్‌ఎం), ఇతర స్కీమ్‌లతో  వినియోగదారులను ఆకట్టుకుంది.


జవహర్‌నగర్‌కు చెందిన పోలోజు సంజయ్‌తో కలిసి  మూడు స్కీమ్‌ల పేరుతో వినియోగదారులను అడ్డంగా దోచుకున్నారు. మొదటి స్కీమ్‌లో.. తమ షోరూంలకు బైక్‌ కొనడానికి వచ్చే వినియోగదారులకు 40% డిస్కౌంట్‌ పేరుతో టోపీ పెడతారు. ఇందుకోసం మరో నలుగురిని ఈ స్కీమ్‌లో చేర్పించాల్సి ఉంటుంది.  ఇక రెండో స్కీమ్‌లో 50% బైక్‌ డబ్బులు చెల్లించి.. 100 రోజులు ఎదురుచూస్తే.. ఆ తర్వాత మిగతా డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా బైకును ఇచ్చేస్తారు. మూడో స్కీమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించినది. వినియోగదారులు పెట్టుబడి పెడితే.. 100 రోజుల్లో రెట్టింపు ఇస్తామని నమ్మబలుకుతారు. ఇలా.. మూడు స్కీమ్‌ల పేరుతో ఇప్పటి వరకు 300 మందికి రూ. 2 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వీరి వద్ద టెలికాలర్‌గా పనిచేసే ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో గొలుసుకట్టు స్కామ్‌ బయటపడిందని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-11-21T13:44:36+05:30 IST