టాస్క్లో ఫోర్స్ ఏదీ.. ఎందుకీ గోప్యత..!?
ABN , First Publish Date - 2021-12-18T19:00:47+05:30 IST
నోటీసులివ్వకుండానే అక్రమ నిర్మాణాలను కూల్చివేసేలా కొత్త నిబంధనలు అందుబాటులోకి వచ్చాయి. ...
- గ్రేటర్లో ఆగని అక్రమ నిర్మాణాలు
- ప్రత్యేక బృందాల పేరిట పెరిగిన వసూళ్లు
- నిబంధనలు మార్చినా, టీంలు ఏర్పాటు చేసినా అదే తంతు
హైదరాబాద్ సిటీ : నోటీసులివ్వకుండానే అక్రమ నిర్మాణాలను కూల్చివేసేలా కొత్త నిబంధనలు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటయ్యాయి. అయినా.. గ్రేటర్లో అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు. మెజార్టీ ప్రాంతాల్లో ఎప్పటిలానే అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణాలు సాగుతుండగా, ఇంకొన్ని చోట్ల రాజకీయ నేతలు ప్రభావం చూపుతున్నారు. కొందరు అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల అవినీతి వల్లే కూల్చివేతలు సక్రమంగా సాగడం లేదని తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ అసె్సమెంట్ (టీఎస్-బీపాస్) యాక్ట్లో భాగంగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, పోలీస్ అధికారులతో కూడిన ఓ సర్కిల్ బృందం మరో సర్కిల్లో కూల్చివేతలు చేపడుతుంది. ఏ బృందాన్ని ఏ సర్కిల్కు పంపాలన్నది (సొంత సర్కిల్ కాకుండా) జోనల్ కమిషనర్ నిర్ణయిస్తారు.
వాస్తవంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలు గుర్తించే బాధ్యతను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్ఏసీ) నుంచి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమితులైన ఇంజనీర్లకు అప్పగించారు. ఒక్కొక్కరికి రెండు, మూడు డివిజన్లు కేటాయించారు. వారిని నయానో, భయానో అదుపులో పెట్టుకుంటున్న పట్టణ ప్రణాళికా విభాగంలోని కొందరు అధికారులు తమ కనుసన్నల్లో జరిగే అక్రమ నిర్మాణాల వివరాలు ఉన్నతాధికారులకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.
ముందస్తు అవగాహన..
సర్కిల్కు చెందిన పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో ఉన్న పరిచయాలు, ముందస్తు అవగాహనలో భాగంగా కొన్ని నిర్మాణాల జోలికి ప్రత్యేక బృందాలు వెళ్లడం లేదు. క్రమం తప్పకుండా ఫిర్యాదులు వస్తే మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో పాక్షిక కూల్చివేతలు చేపడుతున్నారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో ఓ అక్రమ నిర్మాణంపై తరచూ ఫిర్యాదులు అందినా.. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. అధికారుల నుంచి అందిన సూచనతో నిర్మాణదారుడు బయటి వైపు పనులు త్వరగా పూర్తి చేసి రంగులు వేశాడు. జోన్లోని ఓ సర్కిల్ పట్టణ ప్రణాళికా విభాగంలో అన్నీ తానై వ్యవహరించే ఉద్యోగి ఈ తతంగం నడిపించాడని ప్రచారం జరుగుతోంది. ఇదే జోన్లో ఓ ప్రజాప్రతినిధి అండతో పదుల సంఖ్యలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. కూకట్పల్లి జోన్లో ఉన్నతాధికారుల అండదండలతోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
ఎందుకీ గోప్యత..?
కొత్త నిబంధనలతో అక్రమ నిర్మాణాలు తగ్గాయని కేంద్ర కార్యాలయంలోని అధికారులు గొప్పగా చెబుతుంటారు. క్రమం తప్పకుండా కూల్చివేతలు చేపడుతున్నామని పేర్కొంటారు. ఇప్పటి వరకు ఎన్ని నిర్మాణాలు కూల్చివేశారంటే మాత్రం వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తారు. ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాల సమన్వయం, వివరాల సేకరణ బాధ్యతలు ఓఎ్సడీగా కొనసాగుతున్న ఓ అధికారికి అప్పగించామని టౌన్ ప్లానింగ్ వర్గాలు చెబుతుంటే, ‘నాకు సంబంధం లేదు’ అని ఓఎస్డీ సమాధానమిస్తున్నారు. టాస్క్ఫోర్స్ బృందాల ఏర్పాటుతో అక్రమ నిర్మాణాలు ఆగకపోగా, ఆ సాకు చూపి పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు కొందరు అదనంగా దండుకుంటున్నారు.
మల్లంపేటలో ఇదీ తంతు
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేట గ్రామంలో పంచాయతీ అనుమతులతో కొనసాగుతున్న భవవ నిర్మాణ పనులను నిలిపే కార్యక్రమానికి టౌన్ప్లానింగ్ సిబ్బంది శ్రీకారం చుట్టారు. శ్రీ సాయిబాలాజీలో అప్పుడే మొదలైన ఓ భవన నిర్మాణ పనులను నిలిపివేయించి మమ అనిపించారు. బడా భవనాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు.