హైదరాబాద్లో రోడ్డుపై జారిపడుతున్న వాహనదారులు
ABN , First Publish Date - 2021-06-11T19:43:10+05:30 IST
జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యంతో రోడ్డుపై నుంచి వెళ్తున్న పలువురు
హైదరాబాద్ సిటీ/అప్జల్గంజ్ : జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యంతో రోడ్డుపై నుంచి వెళ్తున్న పలువురు వాహనదారులు గాయపడ్డారు. ఈ సంఘటన గౌలిగూడ బ్రిడ్జి వద్ద గురువారం చోటుచేసుకుంది. గౌలిగూడ సాలార్జంగ్ బ్రిడ్జి సమీపంలో ఉన్న హిమ్లిబన్ చెత్త డంపింగ్యార్డుకు జీహెచ్ఎంసీ సిబ్బంది వాహనాల ద్వారా రోజూ చెత్తను తరలిస్తుంటారు. అయితే వాహనాల్లో తీసుకెళ్తున్న వ్యర్థాలు, చెత్త తరచూ బ్రిడ్జి ప్రాంతంలో పడుతుంటాయి. ఈ విషయాన్ని వాహనదారులు, స్థానికులు పలుమార్లు చెప్పినా సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి చెత్త నుంచి జిగురు పదార్థాలు బ్రిడ్జి రోడ్డుపైకి వచ్చాయి. దీంతో ఈ మార్గం నుంచి వెళ్తున్న కొంతమంది వాహనదారులు స్ర్కిడ్ అయ్యి అదుపుతప్పి కిందపడ్డారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఎంఐఎం ఎంఎల్సీ మిర్జా రియాజ్ ఉల్ హసన్ వాహనాలపై నుంచి కిందపడి గాయపడిన బాధితులను 108 అంబులెన్స్ ద్వారా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రోడ్లపై నిర్లక్ష్యంగా చెత్తను వదిలేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.