టు-లెట్‌ బోర్డుకూ జరిమానా

ABN , First Publish Date - 2021-08-25T07:02:10+05:30 IST

మీ ఇంట్లో పోర్షన్‌ ఖాళీగా ఉందా..

టు-లెట్‌ బోర్డుకూ జరిమానా

పాండురంగానగర్‌లో టులెట్‌ బోర్డు, చలానా

జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం తీరిది 

మండిపడుతోన్న పౌరులు


హైదరాబాద్‌ సిటీ/అల్లాపూర్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మీ ఇంట్లో పోర్షన్‌ ఖాళీగా ఉందా.. అద్దెకివ్వాలనుకుంటున్నారా, అయితే జాగ్రత్త.. టు-లెట్‌ అంటూ గోడలకు కాగితాలు అంటించారో.. ఇకఅంతే.. నిర్ధాక్షిణ్యంగా జీహెచ్‌ఎంసీ జరిమానా విధిస్తోంది. మొన్న ఖైరతాబాద్‌ ఆనంద్‌నగర్‌లో గోడకు టు-లెట్‌ అని ఫోన్‌ నెంబర్లతో సహా ఏ-4 పరిమాణంలో ఉన్న కాగితం అంటించినందుకు ఈవీడీఎం విభాగం రూ.2వేలు పెనాల్టీ విధిస్తూ చలానా జనరేట్‌ చేసింది. మూసాపేట డివిజన్‌లోని పాండురంగానగర్‌లో ఇదే తరహాలో సొంత ఇంటికి టు-లెట్‌ అని కాగితం అంటించినందుకు రూ.2 వేలు జరిమానా వేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరిలో ఫొటో తీస్తే.. ఇప్పుడు  జరిమానా వేశారు. అప్పటికే ఇంటి యజమాని పోర్షన్‌ అద్దెకివ్వడంతోపాటు.. అంటించిన కాగితాన్నీ తొలగించడం గమనార్హం. ఏ ప్రాతిపదికన పెనాల్టీ వేస్తున్నారు..? క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారా, లేదా.. అన్న దానికి ఈవీడీఎం వర్గాలు సమాధానం చెప్పడం లేదు. గ్రేటర్‌లో లక్షలాది కుటుంబాలకు అద్దెలే జీవనాధారం. ఉద్యోగం, వ్యాపారం, బతుకుదెరువు కోసం వచ్చే చాలామంది అద్దె ఇళ్లలో నివసిస్తారు. ఇలాంటి మహానగరంలో టు-లెట్‌ కాగితం కనిపిస్తే పెనాల్టీ వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అయితే ఇల్లు అద్దెకిచ్చేదెలా.. అవసరార్ధులకు తెలిసేదెలా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రానురాను రాజు గుర్రం గాడిదయ్యిందన్నట్టుగా జీహెచ్‌ఎంసీ అధికారుల పనితీరు ఉందని పాండురంగానగర్‌లో జరిమానా వేసిన ఇంటి యజమాని లాలయ్యగౌడ్‌ ఆరోపించారు. 

Updated Date - 2021-08-25T07:02:10+05:30 IST