రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్‌

ABN , First Publish Date - 2021-03-21T06:46:15+05:30 IST

మహిళ మెడలోంచి పుస్తెలతాడు గుంజుకుని

రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్‌

మహిళను రోడ్డుపై 20 మీటర్లు లాక్కెళ్లి గొలుసు చోరీ

బాఽధితురాలి మోకాలికి గాయం

హైదరాబాద్‌ సిటీ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చైన్‌స్నాచర్‌ రెచ్చిపోయాడు. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని చైన్‌ కొట్టేసే క్రమంలో ఆమెను రోడ్డుపై 20మీటర్లు లాక్కెళ్లాడు. మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసును తెంపుకొని పరారయ్యాడు. ఇందిరానగర్‌కు చెందిన అనూష శ్రీనగర్‌ కాలనీలోని ఓ సూపర్‌ మార్కెట్లో పనిచేస్తోంది. శనివారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా, వెనుక నుంచి బైక్‌పై అనుసరించిన దొంగ ఆమె మెడలోని గొలుసును తెంపే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినా, దొంగ వదలకుండా మహిళను 20 మీటర్లు లాక్కెళ్లి, చైన్‌ తెంపుకొని పరారయ్యాడు. ఈ ప్రయత్నంలో బాధితురాలి మోకాలికి గాయమైంది. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 


బాలాజీనగర్‌లో పుస్తెలతాడు..  

జవహర్‌నగర్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): మహిళ మెడలోంచి పుస్తెలతాడు గుంజుకుని బైక్‌పై పారిపోయిన సంఘటన జవహర్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. సీఐ మధుకుమార్‌ కథనం ప్రకారం..జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధి శివాజీనగర్‌కు చెందిన బాలమణి(45) శనివారం వస్తువులు కొనుగోలు చేసేందుకు దుకాణానికి నడుచుకుంటూ వెళ్తోంది. ఎదురుగా ఓ యువకుడు వచ్చి ఆమె మెడలో నుంచి పుస్తెల తాడు గుంజుకున్నారు. అక్కడే పార్క్‌ చేసి ఉంచిన బైక్‌పై పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-21T06:46:15+05:30 IST