తెలంగాణ ఈ - పాస్తో ఇక్కట్లు
ABN , First Publish Date - 2021-05-14T19:18:56+05:30 IST
లాక్డౌన్లో అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన వారి పరిస్థితి దయనీయంగా
హైదరాబాద్ సిటీ : లాక్డౌన్లో అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. అవసరమున్న వారికి ఈ పోర్టల్ ద్వారా పోలీసులు పాసులు అందజేస్తున్నప్పటికీ దరఖాస్తులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు వాపోతున్నారు. ఫారం పూర్తిగా నింపిన తర్వాత సర్వర్ లేదా నెట్వర్క్ సమస్య పేరిట క్లోజ్ అవుతోందని చాలా మంది చెబుతున్నారు. మరి కొన్ని చోట్ల ప్రాంతాల నమోదులో ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనే అంశాల్లో స్పష్టత లేకపోవడంతో ఎలా నింపాలో తెలియక తికమక పడుతున్నారు.
ఫొటో, చిరునామా పత్రం, అవసరం నిమిత్తం జత చేయాల్సిన ప్రతుల్లోనూ స్పష్టత లేదని వాపోతున్నారు. ఫొటో అటాచ్ చేసిన తర్వాత, ఆధార్కార్డును పీడీఎఫ్ ఫార్మాట్లో చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవసరం ఏముందనే సపోర్టు పత్రం జత చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. పెళ్లి, అంత్యక్రియలు, బస్టాండ్, రైల్వేస్టేషన్కు వెళ్లే వారు ఎలాంటి పత్రాలు సమర్పించాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఒక్క రోజు లేదా రెండు రోజులకు ఇచ్చే పాస్కోసం ఈ నిబంధనలను పాటించలేక పలు ముఖ్యమైన పనులను వదులుకోవాల్సి వస్తోందని మరి కొందరి ఆవేదన. ఇక హైవేల మీద ఉన్న పెట్రోల్ పంపులు, నగరంలోని చిన్న చిన్న మెడికల్ షాపులు, ఆస్పత్రుల్లో పని చేసే సిబ్బంది, ఇతరత్రా పని చేసే వారు (గుర్తింపు కార్డులు లేని వారు) లాక్డౌన్లో సమస్యలు ఎదుర్కొంటున్నారు.
5 వేలకు పైగా పాసులు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం వరకు 5వేలకు పైగా పాసులు జారీ చేసినట్లు ఎస్బీ అదనపు డీసీపీ ముత్యం రెడ్డి తెలిపారు. బుధవారం 3500 పాసులు జారీ చేయగా, గురువారం మధ్యాహ్నం వరకే వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. పెట్రోల్ పంపులు, మెడికల్ షాపుల్లో పని చేసే వారి గురించి అడగ్గా వారి కోసం ప్రత్యేక గైడ్లైన్స్ లేవని, వారి పనికి సంబంధించి గుర్తింపు పత్రాలు లేదా యాజమాన్యం ధృవపరిచిన పత్రాలు చూపిస్తే చాలని మరో అధికారి చెప్పారు. కొన్ని హోటళ్లు బ్యాక్ డోర్ దందా చేస్తున్నాయని, అందువల్లే స్విగ్గీ, జొమాటో బాయ్లు అన్ని వేళల్లోనూ దర్శనమిస్తున్నారని తెలంగాణ యాప్ బేస్ట్ ప్రతినిధుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సలావుద్దీన్ ఆరోపిస్తున్నారు.