జాతీయ విద్యా విధానంపై విద్యా భారతి ప్రత్యేక చర్చ
ABN , First Publish Date - 2021-07-25T00:23:41+05:30 IST
విద్యారంగంలో భాగస్వాములుగా నిలిచే అధికారులు, నిపుణులు, పరిశోధకులకు జాతీయ విద్యా విధానం మీద అవగాహన కల్పించాలని, ఇందుకు వివిధ మాధ్యమాలను ఎంచుకోవాలని
హైదరాబాద్: విద్యారంగంలో భాగస్వాములుగా నిలిచే అధికారులు, నిపుణులు, పరిశోధకులకు జాతీయ విద్యా విధానం మీద అవగాహన కల్పించాలని, ఇందుకు వివిధ మాధ్యమాలను ఎంచుకోవాలని విద్యాభారతి నిర్వహించిన సమావేశంలో పలువురు అభిప్రాయ పడ్డారు. పాఠశాలల్లో వసతులు, నాణ్యతను పెంచేందుకు అవలంబించాల్సిన పద్దతులను ఈ సమావేశంలో చర్చించారు. హైదరాబాద్లోని శారదాధామంలో విద్యా భారతి అఖిల భారత అధ్యక్షులు దూసి రామకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి దక్షిణమధ్య క్షేత్రం(కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)కు చెందిన ముఖ్యమైన ప్రతినిధులు హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, సామాజిక దూరం, మాస్క్, శానిటైజేషన్ జాగ్రత్తలు తీసుకొంటూ భేటీని నిర్వహించారు. జాతీయ విద్యా విధానం అమలు చేసేందుకు చొరవ చూపించాల్సిన అంశాల మీద చర్చించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులను దీనిలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాల్సిన మార్గాలను అన్వేషించాలన్నారు. క్రమం తప్పకుండా ఉపాధ్యాయులకు శిక్షణ అందించటం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. విద్యా రంగంలో వస్తున్న అధునాతన మార్పులకు సంబందించి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సంఘీభావం తెలిపింది.
ఈ సమావేశంలో విద్యా భారతి సహ సంఘటన మంత్రి మహంతి, శైక్షణిక ప్రముఖ్ రావుల సూర్యనారాయణ, దక్షిణ మధ్య క్షేత్రం అధ్యక్షులు చామర్తి ఉమా మహేశ్వరరావు ఐఏఎస్ (రిటైర్డ్), సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ తిరుపతి రావు, సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పసర్తి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల్లో కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సమావేశం ఏకగ్రీవంగా అభిప్రాయ వ్యక్తం చేసింది.