షర్మిల పార్టీకి ఆల్ ది బెస్ట్ చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2021-07-08T16:21:12+05:30 IST
తెలంగాణలో నేడు ఆవిర్భావంకానున్న వైఎస్ షర్మిల పార్టీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

హైదరాబాద్ : తెలంగాణలో నేడు ఆవిర్భావం కానున్న వైఎస్ షర్మిల పార్టీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పార్టీ సభ జరుగనున్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఆగి వైఎస్సార్ అభిమానులతో ఎంపీ ముచ్చటించారు. పార్టీ ఆవిర్భావ వేడుకకు రావాలని తనకు ఆహ్వానం పంపారని ఆయన తెలిపారు. వైఎస్ గొప్ప నేత అని కొనియాడారు. వైఎస్ జయంతి సందర్భంగా భువనగిరిలో ఆయనకు నివాళులు అర్పించేందుకు వెళ్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
ప్రతి క్షణం కృషి చేస్తా..
కాగా.. అంతకుముందు ఫేస్బుక్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘మహానేత మీరు.. మీతో నడిచిన ప్రతి అడుగులో ఒక్కో విషయం తెలుసుకున్నాను. రైతులకు అండగా ఉండడం, పేద ప్రజలకు ఉచితంగా ఆరోగ్యం మీ ఆలోచన నుంచి పుట్టినవే. అలాంటి మీరు మాకు దూరం కావడం మా దురదృష్టం.. కానీ తప్పకుండా మీరు చూపిన ప్రజా సంక్షేమం కోసమే ప్రతి క్షణం కృషి చేస్తాను’ అని కోమటిరెడ్డి ఫేస్బుక్లో రాసుకొచ్చారు.