హైదరాబాద్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
ABN , First Publish Date - 2021-04-16T18:35:37+05:30 IST
నాలుగు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న గ్యాంగ్స్టర్
హైదరాబాద్ సిటీ : ఒడిశా పోలీసుల నుంచి తప్పించుకొని.. నాలుగు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న గ్యాంగ్స్టర్ షేక్ హైదర్ (60)ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు ఐదురోజుల పాటు సీసీ కెమెరాలు జల్డెడ పట్టి నిందితుడిని గుర్తించారు. ఈ నెల 10న కటక్ నుంచి పారిపోయిన హైదర్, ఆంధ్రప్రదేశ్ మీదుగా హైదరాబాద్కు ఏప్రిల్ 11న వైట్ స్విఫ్ట్ కారు (నెంబర్- ఓడీ02 ఏఎ్స6770)లో వచ్చినట్లు గుర్తించారు. అతడు ప్రయాణించిన కారు ఆనవాళ్లను నగరంలోని ఓ ప్రదేశంలో పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా గమనించారు. రాత్రి 8.42గంటలకు కారును గుర్తించిన పోలీసులకు ఆ తర్వాత కారు ఆనవాళ్లు కనిపించలేదు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది వెయ్యికిపైగా సీపీ కెమెరాలను జల్లెడ పట్టి నిందితుడి జాడను గుర్తించి అరెస్ట్ చేశారు. ఇదే విషయం గురించి సీపీ అంజనీకుమార్ భువనేశ్వర్ కమిషనర్కు, ఒడిశా డీజీపీకి సమాచారమందించారు. కారు మార్చి, లేదా కారు నెంబర్ మార్చి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాడని అనుమానించినా.. చివరకు నగరంలోనే చిక్కాడు.
జంట హత్య కేసులో నిందితుడు
2005లో ఒడిశా- కటక్ నగరంలో జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్పై పలు ఆరోపణలు ఉన్నాయి. రష్మీ మోహపాత్రా హత్యకేసుతోపాటు ఓ మార్బుల్ వ్యాపారిని రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. పోలీసులకే సవాల్ విసురుతూ.. అంచెలంచెలుగా ఎదిగిన గ్యాంగ్స్టర్ను అప్పట్లో ఒడిశా పోలీసులు నాగ్పూర్లో అరెస్టు చేశారు. ఇతడిపై ఆరేళ్ల పాటు సాగిన విచారణానంతరం ఒడిశా కోర్టు అతనితో పాటు సహకరించిన ఇద్దరు అనుచరులకు యావజ్జీవ శిక్ష విధించింది. అప్పటి నుంచి సంబల్పూర్ సర్కిల్ జైల్లో ఉన్న హైదర్ తాజాగా తప్పించుకోవడంతో అక్కడి పోలీసులకు తలనొప్పి మరింత పెరిగింది. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. అనుచరుల సాయంతో తప్పించుకున్నాడు. ఈ కేసులో విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఆరుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ కటక్-భువనేశ్వర్ పోలీస్ కమిషనర్ ఎస్కే ప్రియదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.