మసీదు కమిటీలకు టోపీ.. 2 కోట్లు మోసం చేశాడని అనుమానం!
ABN , First Publish Date - 2021-12-15T16:24:51+05:30 IST
మసీద్ కమిటీ సభ్యులను మాయమాటలతో మోసం చేసిన ఓ వ్యక్తిపై..

హైదరాబాద్ సిటీ/చార్మినార్ : మసీద్ కమిటీ సభ్యులను మాయమాటలతో మోసం చేసిన ఓ వ్యక్తిపై మీర్చౌక్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైంది. అతడి కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ జబ్బార్ తెలిపారు. రెయిన్ బజార్ ప్రాంతానికి చెందిన మహెఫుజుర్ రహ్మాన్(32) కొంత కాలంగా మసీదు కమిటీ ప్రతినిధులను సంప్రదిస్తూ వారిని మాయమాటలతో నమ్మించి భారీగా డబ్బులు తీసుకున్నాడు. అయితే ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులకు సమాచారం అందలేదు. ఈ ఏడాది మేనెలలో మహెఫుజుర్ రహ్మాన్ కనిపించడం లేదంటూ అతని సోదరుడైన ఫజలూర్ రహ్మాన్ మీర్చౌక్ పీఎ్సలో ఫిర్యాదు చేశాడు.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో అతన్ని గుర్తించిన మసీదు కమిటీ ప్రతినిధులు అతను పలువురిని మోసం చేసినట్లు తెలిపారు. మసీదులో కావాల్సిన వస్తువులకు సగం డబ్బు ఇస్తే మిగతా డబ్బు తాను సమకూర్చుతానని నమ్మించి వారి నుంచి డబ్బులు సేకరించేవాడు. ఇలా చాలా కమిటీల నుంచి వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు అనేక మసీదు కమిటీలనుంచి సుమారు రూ.2కోట్లు కాజేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.