HYD : అత్తమామలపై Petrol పోసి నిప్పంటించిన అల్లుడు.. అసలేం జరిగిందని ఆరా తీస్తే..!
ABN , First Publish Date - 2021-10-11T14:29:00+05:30 IST
కేపీహెచ్బీ కాలనీ ఫేజ్-6లో నివాసం ఉంటూ మాదాపూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ...
హైదరాబాద్ సిటీ/హైదర్నగర్ : కూతురిని వేధిస్తున్న అల్లుడిపై కేసు పెట్టిన కారణంగా అత్తమామలపై ఆ అల్లుడు పెట్రోలుపోసి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళ్లితే.. కరీంనగర్కు చెందిన నిఖిత తల్లిదండ్రులతో కలిసి కేపీహెచ్బీ కాలనీ ఫేజ్-6లో నివాసం ఉంటూ మాదాపూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె 2016లో కరీంనగర్కు చెందిన సాయికృష్ణను ప్రేమించి వివాహం చేసుకుంది. పెళ్లైన కొద్దిరోజులకే సాయికృష్ణ అదనపు కట్నం కోసం నిఖితను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో నిఖిత సాయికృష్ణపై 2019లో కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేసి తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది.
తన భార్యను దూరం చేయడంతోపాటు కేసు పెట్టించారని కక్షగట్టిన సాయికృష్ణ శనివారం రాత్రి అత్తగారింటికి వచ్చి వారితో గొడవకు దిగాడు. నిఖితకు బాటిల్ చూపించి అది యాసిడ్ అని చెప్పి ఆమెపై పోస్తానని బెదిరించాడు. దీంతో భయబ్రాంతులకు గురైన నిఖిత గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఆగ్రహించిన సాయికృష్ణ తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ను సాగర్రావు, రమాదేవిలపై పోసి నిప్పంటించాడు. వారు పెద్దగా కేకలు వేయడంతో సాయికృష్ణ అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలైన వారిని నిఖిత గాంధీ ఆస్పత్రికి తరలించారు. సాయికృష్ణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు.